టీ20 ఫార్మాట్లో సెంచరీ సాధించడం అంత సులువు కాదు. బ్యాటింగ్కు అనుకూలించే పిచ్పై ఓపెనర్ ఆఖరి వరకు క్రీజులో నిలబడితే శతక్కొట్టడం ఈజీనే. కానీ మిడిలార్డర్ బ్యాటర్ సెంచరీ సాధించాలంటే కష్టపడాల్సిందే. ఇక 150+ స్కోరు అంటే అది సంక్లిష్టమే. అందుకే 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 150కు పైగా స్కోరు చేసింది ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే.
క్రిస్ గేల్ సాధించిన 175*, బ్రెండన్ మెక్కలమ్ 158* సాధించిన స్కోరే అత్యధికం. ఈ గణాంకాలు చూస్తే టీ20 ఫార్మాట్లో భవిష్యత్లో ఏ ఆటగాడు అయినా డబుల్ సెంచరీ సాధిస్తాడా అని అడిగితే దాదాపు అసాధ్యమనే సమాధానమిస్తారు. కానీ పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ద్విశతకం సాధిస్తాడని కేన్ విలియమ్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 'టీ 20ల్లో 200 మార్క్ను ఎవరు అందుకుంటారు' అనే ప్రశ్నకు విలియమ్సన్.. రోహిత్ శర్మ అని చెప్పాడు.

టీ20 ఫార్మాట్లో అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ ఇప్పటివరకు అయిదు శతకాలు సాధించాడు. అత్యధిక స్కోరు 121. ఇక ఐపీఎల్లో హిట్మ్యాన్ రెండు సార్లు మూడంకెల స్కోరు అందుకున్నాడు. ఇటీవల వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ సెంచరీ బాదాడు. 63 బంతుల్లో అజేయంగా 105 పరుగులు సాధించాడు.
కేన్ విలియమ్సన్ మరో ఆసక్తికర ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ఆల్టైమ్ ఐపీఎల్ కెప్టెన్గా ఎవరని ఎంచుకుంటారనే ప్రశ్నకు ఎంఎస్ ధోనీ అని సమాధానమిచ్చాడు. సీఎస్కే తరఫున ధోనీ అయిదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన సంగతి తెలిసిందే. రోహిత్తో కలిసి అత్యధిక టైటిళ్లు సాధించిన ఐపీఎల్ కెప్టెన్గా ధోనీ రికార్డు సృష్టించాడు. కాగా, ఈ సీజన్లో ధోనీ, రోహిత్ కేవలం ప్లేయర్లుగానే బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
చెన్నై కెప్టెన్సీ పగ్గాలు రుతురాజ్ గైక్వాడ్కు ధోనీ అప్పగించాడు. మరోవైపు రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యకు ముంబై జట్టు బాధ్యతలను కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో ముంబై కెప్టెన్సీ మార్పు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. హార్దిక్, ముంబై ఫ్రాంచైజీపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.