
హైదరాబాద్: ఐపీఎల్ జరుగుతుండగానే ఇంగ్లాండ్ వెళ్లేందుకు ఇండియా నుంచి వెళ్లేందుకు క్రికెట్ జట్టును ప్రకటించేసింది భారత్. అయినా మళ్లీ యోయో టెస్టులో పాసైతేనే విదేశీ పర్యటన అంటూ కొత్త షరతును తెరమీదికి తీసుకొచ్చింది. ఐతే ఈ టెస్టులో పాసవ్వాలంటే వారి కనీస అర్హత ప్రమాణం 16.1 మార్కులు. గత ఏడాది నుంచి ఈ నిబంధన విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కఠినంగా వ్యవహరిస్తోంది.
అయితే యో-యో విషయంలో టీమ్ మేనేజ్మెంట్, బీసీసీఐ ఒక్కో ఆటగాడి విషయంలో ఒక్కోలా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు నిబంధనలు సడలించినట్టు సమాచారం. ఐపీఎల్లో ఏ మాత్రం రాణించకున్నా రోహిత్ను ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ఎంపిక చేశారు. అయితే ఆ తర్వాత అతనికి యో-యో టెస్టు నిర్వహించే క్రమంలో కూడా సడలింపు ఇచ్చారు.
ఈ నెల 15న రోహిత్ యో-యో టెస్టుకు హాజరుకావాల్సి ఉన్నా వ్యక్తిగత పనుల కారణంగా రెండు రోజులు ఆలస్యంగా అతను 17న పరీక్షలో పాల్గొన్నాడు. అయితే, ఈ టెస్టులో అతను విఫలమమైనట్టు వార్తలు వచ్చాయి. కానీ, అతను ఫెయిలైన విషయాన్ని బోర్డు రహస్యంగా ఉంచిందట. అదే సమయంలో అజింక్యా రహానేను స్టాండ్బైగా ఉంచడం కూడా రోహిత్ యో-యోలో ఫెయిల్ అయ్యాడు అనే దానికి బలాన్ని చేకూర్చింది.
కాగా, రోహిత్ విజ్ఞప్తి మేరకు బోర్డు 19వ తేదీన మళ్లీ పరీక్షలో పాల్గొనేందుకు అనుమతించినట్టు తెలుస్తోంది. అయితే, ఆ రోజు కాకుండా మరుసటి రోజున అతను యో-యో టెస్టులో పాల్గొని నెగ్గడం జరిగింది. మరి.. ఈ ముంబై ఆటగాడికి ఇచ్చినట్టుగా సంజూ శాంసన్, మహ్మద్ షమి, అంబటి రాయుడులకు వెంటనే మరో చాన్స్ ఎందుకు ఇవ్వలేదో తెలియడం లేదు.