దుబాయ్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకుని కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు వన్డేల సిరిస్లో రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శనతో రెండు సెంచరీలతో చెలరేగిన సంగతి తెలిసిందే.
ఈ సిరీస్లో మొత్తం 441 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచాడు. ఐసీసీ ఆదివారం ప్రకటించిన వన్డే అత్యుత్తమ బ్యాట్స్మెన్ల జాబితాలో 8 స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. కాగా సిరిస్ను 1-4 తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది.
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో స్థానాన్ని ఉన్నాడు. ఐసీసీ వన్డే అత్యుత్తమ బ్యాట్స్మెన్ల జాబితాలో శిఖర్ ధావన్కి ఏడో స్థానం దక్కగా, తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మాక్స్వెల్ నిలిచాడు.

టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 13వ స్థానంలో నిలవగా, అజింక్య రహానె 25వ స్థానంలో నిలిచారు. ఇక బౌలర్ల జాబితాలో గాయం కారణంగా భారత్తో సిరీస్కి దూరమైన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అగ్రస్థానాన్ని కోల్పోయి మూడో స్థానంలో నిలిచాడు.
న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాత స్థానంలో బంగ్లాదేశ్ బౌలర్ షకిబ్ అల్ హసన్ దక్కించుకున్నాడు. భారత్ బౌలర్లలో ఎవరూ టాప్-10లో చోటు దక్కించుకోక పోవడం విశేషం. భారత స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ 11 ర్యాంక్లో నిలిచాడు.