భారత క్రికెట్ లో కొత్త శకం ప్రారంభమైంది. టెస్టుల అనంతరం వన్డేల్లో కూడా శుభ్మన్ గిల్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తూ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. దీంతో రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ ముగిసింది. ఆస్ట్రేలియా సిరీస్కు శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఎంపిక కాగా.. రోహిత్ శర్మ తనను తాను కేవలం ఆటగాడిగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వన్డేల్లో కెప్టెన్గా ప్రపంచకప్ గెలవాలనే రోహిత్ శర్మ కల ఈ నిర్ణయంతో చెదిరిపోయింది. అయితే ఈ నిర్ణయంపై మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సెలెక్టర్లు, బీసీసీఐపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రోహిత్ శర్మకు మరింత సమయం ఇవ్వాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు.

కైఫ్ ఆగ్రహం: 16 ఏళ్లు ఇచ్చినా.. ఏడాది ఇవ్వలేకపోయాం..
రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై మహ్మద్ కైఫ్ ఘాటుగూ స్పందించారు. ఈ నిర్ణయాన్ని చాలా తొందరపాటు చర్యగా ఆయన అభివర్ణించారు. "రోహిత్ శర్మ ఇండియాకు తన 16 ఏళ్లు ఇచ్చారు. కానీ కెప్టెన్గా మనం ఆయనకు ఒక్క సంవత్సరం కూడా ఇవ్వలేకపోయాం." అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఆడిన 16 ఐసీసీ ఈవెంట్లలోని మ్యాచ్లలో, 15 మ్యాచ్లు గెలిచింది. కేవలం 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో మాత్రమే ఓడిపోయింది.
ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ విజయం సాధించింది. దుబాయ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన కొద్ది నెలల్లోనే కెప్టెన్ను తొలగించడంపై మహ్మద్ కైఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్ శర్మకు అనుకూలంగా మహ్మద్ కైఫ్ ఓ కీలక విషయాన్ని గుర్తు చేశారు. గతంలో 2024 టీ20 ప్రపంచ కప్లో భారత్ను గెలిపించిన తర్వాత రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. కొత్త ఆటగాళ్ల కోసం రోహిత్ తప్పుకున్నారు. కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. ఇండియాలో చాలా మంది ఆటగాళ్లు తమ ఫామ్ నడుస్తున్నంత వరకు జట్టులో కొనసాగడానికి ప్రయత్నిస్తారని, కానీ రోహిత్ అలా చేయలేదని కైఫ్ ప్రశంసించారు.
కెప్టెన్ గా ఒక ఐసీసీ టైటిల్ గెలిచినప్పటికీ.. ప్రపంచకప్ వరకు కూడా రోహిత్ శర్మకు అవకాశం ఇవ్వకుండా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని కైఫ్ బీసీసీఐపై మండిపడ్డారు.