టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్య నైపుణ్యాలపై అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. హిట్మ్యాన్ కెప్టెన్సీ సూపర్ అంటూ అభిమానులతోపాటు మాజీ ఆటగాళ్లు కొనియాడుతున్నారు. తాజాగా విండీస్తో ముగిసిన రెండో వన్డే మ్యాచ్లో భారత్ విజయంలో రోహిత్ కెప్టెన్సీ కీలకపాత్ర పోషించింది. రోహిత్ శర్మ ఫీల్డింగ్ మార్పులు, బౌలర్ల మార్పులు జట్టుకు కలిసొచ్చాయి. విండీస్ ఓపెనర్లు క్రీజులో కుదురుకుంటున్న సమయంలో తనదైన వ్యూహాలు పన్ని వారిని బోల్తా కొట్టించాడు. ప్రసిద్ధ్ కృష్ణను బౌలింగ్కు తీసుకువచ్చి వెంట వెంటనే 2 వికెట్లు రాబట్టాడు. అలా మ్యాచ్ మొత్తంలోనూ తన కెప్టెన్సీ మార్క్ వ్యూహాలతో విండీస్ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. విండీస్ బ్యాటర్లు ఒక్క వికెట్ కూడా హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పలేక పోయారంటే రోహిత్ బౌలింగ్ కూర్పు, ఫీల్డింగ్ సెటప్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక తొలి వన్డేలో రోహిత్ తీసుకున్న 3 డీఆర్ఎస్లు, రెండో వన్డేలో తీసుకున్న ఒక డీఆర్ఎస్ టీమిండియాకు అనుకూలంగా రావడం చూస్తే అతని ప్రతిభకు అద్దం పడుతుంది. దీంతో రోహిత్ శర్మను డీఆర్ఎస్ కింగ్ అంటూ అభిమానులు కొనియాడుతున్నారు. కీలక సమయంలో బౌలర్లను హిట్మ్యాన్ అద్బుతంగా వినియోగించుకున్నాడని క్రికెట్ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. రోహిత్ ఇదే మార్క్ కెప్టెన్సీతో ముందుకెళ్లితే ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్కప్, వచ్చే ఏడాది ఇండియా వేదికగా జరగనున్న వన్డే వరల్డ్కప్ టీమిండియానే గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు.
కాగా నేడు వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ను గెలవడం ద్వారా టీమిండియా 3 వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో గెలుచుకుంది. కెప్టెన్గా రోహిత్ శర్మ ఖాతాలో మూడో వన్డే సిరీస్ చేరింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ ఒక్క సిరీస్లో కూడా భారత్ ఓడిపోలేదు. అంతేకాకుండా రోహిత్ శర్మ టీమిండియాకు పూర్తి స్థాయి కెప్టెన్ అయిన తర్వాత అతడు నాయకత్వం వహించిన మొదటి 5 మ్యాచ్లను జట్టు గెలిచింది. ఒక్కటి కూడా ఓడిపోలేదు. రోహిత్ శర్మ తన కెరీర్లో ఇప్పటివరకు 12 వన్డే మ్యాచ్లకు కెప్టెన్సీ చేయగా భారత జట్టు ఏకంగా 10 మ్యాచ్ల్లో గెలిచింది. ఇక 22 టీ20లకు సారథ్యం వహించగా రికార్డు స్థాయిలో 18 టీమిండియా విజయం సాధించింది. దీంతో హిట్మ్యాన్ది లక్కీ హ్యాండ్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.