హైదరాబాద్: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుని అందుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 150 సిక్సులు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్ధానంలో నిలిచాడు.
ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అగ్రస్థానంలో ఉన్నాడు. షాహిద్ అఫ్రిది 164 మ్యాచ్ల్లో 160 ఇన్నింగ్స్ల ద్వారా అత్యంత వేగంగా 150 సిక్స్లు నమోదు చేశాడు. కాన్పూర్లోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ 147 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో 18 ఫోర్లు, రెండు సిక్స్లు ఉన్నాయి. ఈ వన్డేలో రెండు సిక్సులు బాదడంతో రోహిత్ శర్మ సాధించిన సిక్సుల సంఖ్య 150కి చేరింది. 171 మ్యాచ్ల్లో 165 ఇన్నింగ్స్ల ద్వారా రోహిత్ శర్మ 150 సిక్స్లను మైలురాయిని అందుకున్నాడు.
రోహిత్ శర్మ తర్వాత మహేంద్ర సింగ్ ధోని 192, సౌరవ్ గంగూలీ 226, యువరాజ్ సింగ్ 327, సచిన్ టెండూల్కర్ 343 ఇన్నింగ్స్ల్లో 150 సిక్స్లు సాధించిన భారత ఆటగాళ్లు. 2013 నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రోహిత్ శర్మ ఓపెనర్గా బరిలోకి దిగుతున్నాడు.
కాగా, న్యూజిలాండ్తో జరిగిన మూడు వన్డేల సిరిస్ను 2-1తో కోహ్లీసేన కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాన్పూర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సెంచరీలతో చెలరేగారు. ఇరు జట్ల మధ్య నవంబర్ 1 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.