బంగ్లాదేశ్ను టెస్టు, టీ20 ఫార్మాట్లో క్లీన్స్వీప్ చేసిన భారత్.. స్వదేశంలో మరో టెస్టు సిరీస్కు సిద్ధమైంది. బుధవారం నుంచి న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడాడు. యువ ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
న్యూజిలాండ్ టెస్టు సిరీస్కు నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణను ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక అయ్యారు.బంగ్లాదేశ్ టీ20 సిరీస్తో తెలుగు తేజం నితీశ్, స్పీడ్ సంచలనం మయాంక్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. రెండో టీ20లో నితీశ్ 34 బంతుల్లో 74 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మయాంక్ మూడు మ్యాచ్ల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.

అయితే స్వదేశంలో సిరీస్ ఆడుతున్నప్పటికీ, ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లుగా నితీశ్, మయాంక్లను ఎంపిక చేయడంపై రోహిత్ వివరణ ఇచ్చాడు. సాధారణంగా స్వదేశంలో జరిగే సిరీస్లకు రిజర్వ్ ప్లేయర్లను ఎంపిక చేయరు. బెంచ్ బలాన్ని పెంచుకోవడానికి యువ ఆటగాళ్లను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేసినట్లు రోహిత్ తెలిపాడు. అయితే వాళ్లకు ఇప్పుడే టెస్టు జట్టులో అవకాశం రాదని అన్నాడు. ఎవరైనా ఆటగాడు గాయపడితే జట్టులోకి వస్తారని పేర్కొన్నాడు.
''వాళ్లు ఎక్కువగా క్రికెట్ ఆడలేదు. అయితే మేం బెంచ్ బలాన్ని పెంచాలనుకుంటున్నాం. ఈ క్రమంలో వాళ్లను అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం. జట్టులో ఎవరికైనా గాయమైతే వాళ్లకు అవకాశం వస్తుంది. జట్టుతో వాళ్లు ఉండటం ఆనందంగా ఉంది. టెస్టు క్రికెట్ను వాళ్లు చూసే విధానం, మాట్లాడటం బాగుంది. ఇక జట్టును క్రమంగా నిర్మించడం ఎంతో కీలకం. వాళ్లు జట్టుకు ఏం అందించగలరని పరిశీలిస్తున్నాం'' అని రోహిత్ శర్మ తెలిపాడు.
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు: నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ.