ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మను వన్డే కెప్టెన్ పదవి నుంచి తొలగించి ఆ బాధ్యతలను శుభ్మన్ గిల్కు అప్పగించింది. కొద్ది నెలల క్రితమే రోహిత్ శర్మ భారత్కు ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని అందించినా.. ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ రోహిత్ శర్మ కెప్టెన్గా ఆడిన చివరి మ్యాచ్. ఇకపై శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ సహకారంతో 2027 వన్డే ప్రపంచ కప్ కోసం భారత్కు నాయకత్వం వహిస్తాడు.
రోహిత్, కోహ్లీకి అగార్కర్ స్పష్టమైన సందేశం
రోహత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో సహా ఆటగాళ్లందరికీ ఒక స్పష్టమైన సందేశాన్ని పంపారు. జట్టులో తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే వారు విజయ్ హజారే ట్రోఫీ ఆడాలి. అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. "ఆటగాళ్లు అందుబాటులో ఉన్నప్పుడల్లా.. వారు దేశీయ క్రికెట్ ఆడాలని ఓ సంవత్సరం క్రితమే స్పష్టం చేశామని భావిస్తున్నాను, ఆటగాళ్లు తమను తాము చురుకుగా ఉంచుకోవడానికి క్రికెట్ ఆడుతూ ఉండటానికి ఇదే ఏకైక మార్గం, విరామం చాలా ఎక్కువ ఉంటే దేశీయ క్రికెట్ ఆడాల్సిందే." అని అగార్కర్ స్పష్టం చేశారు. "అంతర్జాతీయ క్రికెట్తో అది సాధ్యమవుతుందో లేదో కాలమే చెబుతుంది, కానీ ఆటగాళ్లు ఖాళీగా ఉంటే, వారు తప్పనిసరిగా దేశీయ క్రికెట్ ఆడాలి" అని ఆయన తేల్చి చెప్పారు.

సీనియర్ల దేశీయ క్రికెట్ రికార్డు
రోహిత్ శర్మ చివరిసారిగా లిస్ట్ ఏ టోర్నమెంట్ను 2018లో ఆడాడు. ఆ ఏడాది వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ కారణంగా అతను ఫైనల్లో ఆడలేకపోయాడు. విరాట్ కోహ్లీ చివరిసారిగా విజయ్ హజారే ట్రోఫీని 2010లో ఆడారు. 2013లో విరాట్ కోహ్లీ ఎన్కేపీ ట్రోఫీలో ఢిల్లీకి కెప్టెన్ గా వ్యవహరించారు. 2025 జనవరిలో ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడి దేశీయ క్రికెట్కు తిరిగి వచ్చారు.
ఆస్ట్రేలియా సిరీస్తో రోహిత్, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్కు తిరిగి రానున్నారు. వారు చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ తరఫున ఆడారు. 2027 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో వీరిద్దరూ భాగమవుతారా లేదా అనేది తేలాల్సి ఉంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డే మ్యాచ్లు అక్టోబర్ 19, 23, 25 తేదీలలో పెర్త్, అడిలైడ్, సిడ్నీలలో జరగనున్నాయి. వన్డే సిరీస్ తర్వాత, ఇరు జట్లు 5 టీ20 మ్యాచ్లలో తలపడతాయి.