కొత్త ఏడాదిలో టీమిండియా శుభారంభం చేసింది. కేప్ టౌన్ కఠిన పిచ్పై దక్షిణాఫ్రికాను ఏడు వికెట్లతో చిత్తుచేసింది. రెండు టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ క్రమంలో టెస్టు చరిత్రలోనే రికార్డు నమోదైంది. అత్యంత తక్కువ బంతుల్లో ఫలితం వచ్చిన టెస్టుగా భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ రికార్డులకెక్కెంది. కేవలం ఒకటిన్నర రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్ ఫలితం 106.2 ఓవర్లలోనే తేలింది.
దక్షిణాఫ్రికా పర్యటన ముగించిన భారత్ మరో సవాలుకు సిద్ధం కానుంది. జనవరి 11 నుంచి స్వదేశంలో అఫ్గానిస్థాన్తో టీమిండియా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. బలమైన ప్రత్యర్థి కానప్పటికీ ఈ సిరీస్ కీలకం కానుంది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ ముందు భారత్ తలపడే ఆఖరి టీ20 సిరీస్ ఇదే. అమెరికా-వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా జూన్లో టీ20 ప్రపంచకప్నకు ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.

అయితే అఫ్గాన్ సిరీస్పై ఆసక్తి పెంచే మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సిరీస్లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆడనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు భారత్ తరపున పొట్టి ఫార్మాట్కు దూరమై దాదాపు 14 నెలలు దాటింది. చివరిగా 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్లో సెమీఫైనల్స్ ఆడారు. ఆ తర్వాత టీమిండియా తరపున టీ20 ఫార్మాట్కు దూరమయ్యారు.
కానీ మరికొన్ని నెలల్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఈ స్టార్ క్రికెటర్లను తిరిగి జట్టులోకి తీసుకురావాలని బీసీసీఐ భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే తిరిగి టీ20 జట్టులో ఎంపిక చేయనుంది. అఫ్గానిస్థాన్ సిరీస్ కోసం రోహిత్, కోహ్లిలతో కూడిన భారత జట్టును సెలక్టర్లు ఇవాళ సాయంత్రం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ ప్రణాళికలో రోహిత్, కోహ్లి అభిప్రాయాల కోసం సెలక్టర్లు ఇటీవల దక్షిణాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్లో పాల్గొనడానికి వారిద్దరు ఆసక్తి కనబరచడంతో తిరిగి జట్టులో తీసుకువస్తున్నారు.
అయితే అఫ్గాన్ సిరీస్కు బుమ్రా, సిరాజ్ విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. జనవరి 25 నుంచి ఇంగ్లాండ్తో అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుండటంతో ఈ స్టార్ పేసర్లపై పనిభారం తగ్గిస్తున్నారు. మరోవైపు గాయంతో జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్లకు కూడా విశ్రాంతిని ఇస్తున్నారు. దీంతో యువ ప్లేయర్లకు మరోసారి అవకాశాలు ఎక్కువగా దక్కనున్నాయి.
కాగా, భారత్-అఫ్గానిస్థాన్ మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది. జనవరి 11న మొహాలి వేదికగా తొలి మ్యాచ్, జనవరి 14న ఇండోర్లో రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. బెంగళూరు వేదికగా ఆఖరి మ్యాచ్ జరగనుంది.