అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా భారత్ మరో సమరానికి సిద్ధమైంది. బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. అయితే గబ్బా టెస్టులో భారత తుదిజట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి పెరిగింది. తొలి టెస్టు విన్నింగ్ కాంబినేషన్ రెండో టెస్టులో మార్పులు చేయగా, టీమిండియాకు ప్రతికూల ఫలితం వచ్చింది.
వాస్తవానికి కెప్టెన్ రోహిత్ శర్మ, యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ రాకతో భారత బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టంగా మారింది. కానీ అడిలైడ్ టెస్టులో బ్యాటింగ్ వైఫల్యంతో పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు తుదిజట్టు మార్పులు అనివార్యమైంది. అయితే గబ్బా పిచ్కు అనుకూలంగా టీమిండియా ప్లేయింగ్ 11ను సిద్ధం చేయనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఈ క్రమంలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని జట్టు నుంచి తప్పించడానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. గబ్బా వికెట్ పేస్, వేగం, బౌన్సీలతో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండనుంది. అంతేగాక మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ పేర్కొనడంతో గబ్బా పిచ్ పేసర్లకు స్వర్గధామంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఆల్రౌండర్కు బదులుగా స్పెషలిస్ట్ బ్యాటర్ లేదా స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ను తుదిజట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోందని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై తెలుగు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్-గంభీర్ అంతిమ నిర్ణయిం ఇదే అయితే.. పిచ్చి నిర్ణయమే అవుతుందని రియాక్ట్ అవుతున్నారు. తొలి రెండు టెస్టుల్లోని నాలుగు ఇన్నింగ్స్ల్లో మూడు సార్లు నితీశ్ రెడ్డినే టాప్ స్కోరర్ అని గుర్తు చేస్తున్నారు. పెర్త్ టెస్టులో నితీశ్ 41, 38* పరుగులు చేశాడు. భారత తొలి ఇన్నింగ్స్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నితీశ్దే. ఇక అడిలైడ్ టెస్టులో తెలుగు కుర్రాడు 42, 42 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా రెండు ఇన్నింగ్స్ల్లో నితీశ్ రెడ్డినే టాప్ స్కోరర్.