
లండన్: సుదీర్ఘ పర్యటనలో భాగంగా ప్రస్తుతం కోహ్లీసేన ఇంగ్లాండ్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరుగుతోన్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా వైఫల్యం చెందుతోంది. ఇప్పటికే ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో 31 పరుగులు చేతిలో ఓటమిపాలైంది.
ఇక, శుక్రవారం లార్డ్స్లో ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 107 పరుగులకే ఆలౌటైంది. నిజానికి, తొలి టెస్టులో ఎదురైన ఓటమికి ప్రతిష్టాత్మక లార్డ్స్లో బదులిస్తారేమో అని అభిమానులు ఆశించినా టీమిండియా ఆటతీరులో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.
తొలి రోజులాగే రెండో రోజు కూడా మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో రెండు సెషన్లలో కేవలం 8.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వర్షం దోబూచులాడిన రెండో రోజు ఆఖరి ఇన్నింగ్స్ మాత్రమే పూర్తిగా సాగగా ఇంగ్లండ్ పేసర్లు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బంతులతో చెలరేగారు.
ముఖ్యంగా జేమ్స్ ఆండర్సన్ (5/20) ధాటికి భారత్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో 35.2 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. రవిచంద్రన్ అశ్విన్ (29) మాత్రమే టాప్ స్కోరర్గా నిలిచాడు. మరో బౌలర్ క్రిస్ వోక్స్కు రెండు వికెట్లు దక్కాయి.
ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టీమిండియాకు మద్దతుగా నిలవాలని, వారిని ప్రోత్సహించాలని ట్విటర్ ద్వారా కోరాడు. "ఈ ఆటగాళ్లే టీమిండియాకు టెస్టుల్లో నంబర్వన్ ర్యాంకు అందించారని మరవొద్దు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి మద్దతివ్వండి. ఎందుకంటే ఇది మన జట్టు" అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
రోహిత్ శర్మ ట్వీట్కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ సైతం స్పందించాడు. "నీ వ్యాఖ్యలను నేను అంగీకరిస్తాను. కమాన్ ఇండియా. మనం సాధించగలం" అని టీమిండియాకు తన మద్దతు తెలిపాడు. వరుణుడు అడ్డంకిగా మారిన రెండో రోజు కేవలం మూడు గంటల ఆట మాత్రమే సాధ్యపడింది. ఆ మూడు గంటల్లోనే 35.2 ఓవర్లలో 107 పరుగులకే భారత్ కుప్పకూలింది.
మరోవైపు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్లో "ప్రస్తుత పిచ్పై బ్యాటింగ్ చేయడం చాలా సవాల్తో కూడుకున్నది. పరిస్థితులను పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఇంగ్లాండ్ గొప్పగా బౌలింగ్ చేసింది. కష్టమైన పరిస్థితులలో ప్రత్యర్థి మంచి బౌలింగ్తో ఎదురుదాడి చేస్తున్న సమయంలోనే బాగా రాణించడమే బ్యాట్స్మన్కు సిసలైన పరీక్ష" అని పేర్కొన్నాడు.
{document1}