Rohit Sharma: ఆస్ట్రేలియా టూర్ కోసం టీమిండియాను ఎంపిక చేసిన తర్వాత క్రికెట్ వర్గాల్లో రోహిత్ శర్మ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ పర్యటనకు రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించి.. యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ను కొత్త సారథిగా నియమించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీని కోల్పోవడంతో ఆయన దాదాపు 13 ఏళ్ల క్రితం చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం విపరీతంగా వైరలవుతూ.. అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
నిజమైన 'హిట్మ్యాన్' జోస్యం!
2012 సంవత్సరంలో రోహిత్ శర్మ అప్పటి యువ క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేస్తున్న ఒక ఫోటోను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ సమయంలో రోహిత్ శర్మ దానికి ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి అద్ధం పడుతోంది. "ఒక శకం ముగిసింది (45), ఒక కొత్త శకం ప్రారంభం (77)." అంటూ రోహిత్ దానికి ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. నిజానికి ఆ పోస్టును రోహిత్ శర్మ తన జెర్సీ నంబర్లకు సంబంధించి చేశారు. అభిమానులు ఎప్పుడూ 45వ నంబర్ జెర్సీని ధరించే రోహిత్ ను చూశారు. కానీ 2012లో కొద్ది కాలం పాటు ఆయన 77వ నంబర్ జెర్సీని ధరించారు. అప్పుడు సరదాగా చేసిన ఆ క్యాప్షన్.. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత భారత క్రికెట్లో కెప్టెన్సీ మార్పుకు సరిగ్గా సరిపోవడం విశేషం.

77వ నంబర్ వెనుక పెద్ద కథ
రోహిత్ శర్మ పాత పోస్ట్ వైరల్ కావడానికి ప్రధాన కారణం కొత్త వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా 77వ నంబర్ జెర్సీనే ధరించడం. శుభ్మన్ గిల్ ఇప్పటికే టెస్ట్ కెప్టెన్గా ఎంపిక కాగా.. ఇప్పుడు వన్డే కెప్టెన్సీ పగ్గాలు కూడా చేపట్టాడు. భవిష్యత్తులో సూర్యకుమార్ యాదవ్ తర్వాత టీ20 కెప్టెన్సీ కూడా గిల్ చేపట్టే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా జట్టు ఎంపిక తర్వాత ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నిర్వహించడం కష్టమని స్పష్టం చేశారు. దీని ద్వారా భవిష్యత్తులో శుభ్మన్ గిల్ మూడు ఫార్మాట్లకు కెప్టెన్ అవుతాడని సంకేతాలు ఇచ్చారు.
రోహిత్ శకం(45) ముగిసి.. శుభ్మన్ గిల్ యుగం(77) ప్రారంభం కావడానికి గిల్ వయస్సు కేవలం 25 ఏళ్లు కావడం మరో కారణం. భారత జట్టు దీర్ఘకాలికంగా జట్టును నడిపించగలిగే స్థిరమైన కెప్టెన్ను నియమించుకోవాలని భావించింది. అందుకే హిట్ మ్యాన్ అనుకోకుండా చేసిన పాత పోస్టు ఇప్పుడు భారత క్రికెట్ చరిత్రకు ఓక సాక్ష్యంగా వైరల్ అవుతోంది.