ఆ మ్యాచ్ చాలా స్పెషల్:
ప్రజ్ఞాన్ ఓజా రిటైర్మెంట్పై భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఓపెనర్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యారు. ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఓజా రిటైర్మెంట్పై స్పందిస్తూ హృదయపూర్వక సందేశాన్ని పోస్ట్ చేశారు. 'నీ మంచి హృదయాన్ని, పనిలో నైపుణ్యాన్ని చూడటం ఎల్లప్పుడూ చాలా బాగుంటుంది. 2013లో నా వీడ్కోలు టెస్టులో పది వికెట్లు తీసి ఆ మ్యాచ్ను మధురంగా మలిచావు. నీ రెండో ఇన్నింగ్స్ సాఫీగా సాగాలి మిత్రమా' అని సచిన్ ట్వీట్ చేసారు.
ఎన్నో మధుర జ్ఞాపకాలు:
'ఓజి.. టీమిండియాతో పాటు ఐపీఎల్లోనూ నీతో అనేక మధుర జ్ఞాపకాలను పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. క్రికెట్ పరిధిని దాటి మన స్నేహం విస్తరించింది. రిటైర్మెంట్ తర్వాత నీ జీవితం సాఫీగా సాగాలని కోరుకుంటున్నా. నీ అనుభవాన్ని రాబోయే తరాలకు అందించు' అని రోహిత్ రాసుకోచ్చారు. రోహిత్తో కలిసి ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరపున ఓజా ఆడారు.

2013లో చివరి మ్యాచ్:
2008లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ప్రజ్ఞాన్ ఓజా 16 సంవత్సరాలు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడారు. అయితే 2013 నుండి అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినప్పటికీ.. 2019 వరకు దేశీయ క్రికెట్ ఆడారు. ఓజా భారత్ తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20లు ఆడారు. టెస్టుల్లో 113 వికెట్లు.. వన్డేల్లో 21 వికెట్లు, టీ20ల్లో10 వికెట్లను ఖాతాలో వేసుకున్నారు. 2013లో ముంబైలో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఓజా చివరిసారిగా భారత్ తరఫున ఆడారు.

బౌలింగ్ యాక్షన్పై అనుమానాలు:
2014లో ప్రజ్ఞాన్ ఓజా బౌలింగ్ యాక్షన్పై అనుమానాలు వచ్చినా.. 2015లో క్లియరెన్స్ లభించింది. 2018లో బిహార్ తరఫున తన చివరి ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడారు. అప్పట్నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్న ఓజా.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని తాజాగా ప్రకటించారు.


Click it and Unblock the Notifications












