'కోహ్లి గోస్ డౌన్ ది గ్రౌండ్.. కోహ్లి గోస్ ఔట్ ఆఫ్ ది గ్రౌండ్'.... అంటూ ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే 2022 టీ20 వరల్డ్ కప్లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానులకు ఎంతో ప్రత్యేకమైనవి. మునుపెన్నడూలేని విధంగా యుద్ధరీతిలో సాగిన పోరాటంలో టీమిండియాను విరాట్ కోహ్లి గెలిపించిన తీరు అద్భుతం, అసాధారణం, అనిర్వచనీయం.
ఈ అద్వితీయమైన కోహ్లి ఇన్నింగ్స్కు నేటితో రెండేళ్లు. భారత్ చేతిలో చిత్తుగా ఓడి బాధతో పాకిస్థాన్ అభిమానులు టీవీలు పగలగొట్టిన సంఘటనకు నేటితో సరిగ్గా రెండేళ్లు!! 160 పరుగుల ఛేదనలో 31/4తో కష్టాల్లో నిలిచిన జట్టును కోహ్లి (82 నాటౌట్; 53 బంతుల్లో, 6 ఫోర్లు, 4 సిక్సర్లు).. హార్దిక్ పాండ్య (40; 37 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్)తో కలిసి ఆదుకున్నాడు. అయిదో వికెట్కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

అయితే ఈ చిరస్మరణీయ మ్యాచ్కు రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఐసీసీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. దీనిలో కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ మ్యాచ్ అనుభవాలు పంచుకున్నారు.
'ఆ మ్యాచ్లో మేం కష్టాల్లో చిక్కుకున్నాం. నేనెంతో భయపడే వ్యక్తిని. దీంతో లైవ్ కూడా చూడకుండా డ్రెస్సింగ్ రూమ్లో కూర్చున్నా. కానీ విరాట్ కోహ్లి- హార్దిక్ పాండ్య తమ భాగస్వామ్యంతో మ్యాచ్ను మలుపుతిప్పారు. ఆఖరి ఓవర్లలో బయటకు వచ్చి మ్యాచ్ చూశాను. ఆ క్షణాల్ని ఆస్వాదించాను'- రోహిత్ శర్మ
'మేం వికెట్లను త్వరగా కోల్పోయాం. ఆ సమయంలో మేం గెలిచే శాతం 2-3 శాతమని విన్ ప్రిడిక్టర్ చూపించింది. కానీ విరాట్ కోహ్లి గొప్ప ఇన్నింగ్స్, హార్దిక్తో భాగస్వామ్యంతో గెలిచాం. అయితే ఆ మ్యాచ్, ఆ విజయం అద్వితీయం.. ఓ మై గాడ్' - సూర్యకుమార్ యాదవ్
'మెల్బోర్న్లో పాకిస్థాన్పై గెలిచిన మ్యాచ్ అద్భుతం. ఆ మ్యాచ్ను వర్ణించడానికి మాటల్లేవ్'- రిషభ్ పంత్
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. షాన్ మసూద్ (52; 42 బంతుల్లో, 5 ఫోర్లు), ఇఫ్తికర్ అహ్మద్ (51; 34 బంతుల్లో, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించారు. అయితే ఛేదనలో కేఎల్ రాహుల్ (4), రోహిత్ శర్మ (4), సూర్యకుమార్ యాదవ్ (15), అక్షర్ పటేల్ (2) విఫలమయ్యారు. 10 ఓవర్లకు భారత్ స్కోరు 45/4 మాత్రమే.ఆఖర్లో భారత్ విజయానికి ఆఖరి 18 బంతుల్లో 48 పరుగులు అవసరం. అప్పుడు కోహ్లి చెలరేగిన తీరు అసాధారణం.
షాహిన్ అఫ్రిది బౌలింగ్లో కోహ్లి మూడు బౌండరీలు బాదడంతో 17 పరుగులు వచ్చాయి. కానీ 19వ ఓవర్ వేసిన హారీస్ రవూప్ తొలి నాలుగు బంతులకు 3 పరుగులే ఇచ్చాడు. ఆ తర్వాత బౌన్సర్గా వేసిన బంతిని కోహ్లి ఓ వెనకడుగు వేసి బౌలర్ మీదుగా కళ్ళుచెదిరే సిక్సర్ బాదాడు. తర్వాత బంతిని కూడా సిక్సర్గా మలిచాడు. ఇక చివరి ఓవర్లో 16 పరుగులు అవసరమవ్వగా కోహ్లి సిక్సర్ బాదగా, ఆఖరి బంతికి విన్నింగ్ షాట్ను అశ్విన్ ఆడాడు.