ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. 2024 టీ20 ప్రపంచకప్ అనంతరం టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి కూడా రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో మే నెలలో టెస్ట్ క్రికెట్కు ఈ స్టార్ జోడీ ఆకస్మికంగా వీడ్కోలు పలకడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వీరి నిర్ణయంపై మాజీ భారత క్రికెటర్ రాబిన్ ఉతప్ప తీవ్ర సందేహాలు వ్యక్తం చేయడంతో పాటు, అది సహజమైనది కాదని, నిర్బంధం వల్ల తీసుకున్నదని అభిప్రాయపడ్డారు.
తన యూట్యూబ్ ఛానెల్లో ఉతప్ప మాట్లాడుతూ, "ఇది బలవంతంగా చేసిన లొంగుబాటో కాదో నాకు తెలియదు. కానీ ఇది అస్సలు సహజమైన వీడ్కోలులా అనిపించడం లేదు. నిజం ఏమిటో వారు ఇద్దరూ తమ సమయం వచ్చినప్పుడు చెబుతారు అని నేను అనుకుంటున్నాను" అని స్పష్టం చేశారు. ఈ ఆకస్మిక నిర్ణయానికి గల అసలు కారణం వివరించడం పూర్తిగా వారిద్దరిదే అని ఉతప్ప పేర్కొన్నారు.

రోహిత్, విరాట్ల టెస్ట్ రిటైర్మెంట్ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వారి నిరాశాజనక ప్రదర్శన తర్వాత, టెస్ట్ కెరీర్ను కొనసాగించేందుకు ఇద్దరూ చాలా కాలం తర్వాత రంజీ ట్రోఫీలో ఆడారు. అయినప్పటికీ, మే నెలలో వారు రహస్యంగా టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పారు. ఇదే సమయంలో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు ముందు శుభ్మన్ గిల్ను కొత్త టెస్ట్ కెప్టెన్గా ప్రకటించారు.
ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ పరుగులు చేయలేకపోయినప్పుడు, అతను ఆరు నెలల విరామం తీసుకుని తన శారీరక దారుఢ్యంపై దృష్టి సారించాలని భావించినట్లు ఉతప్ప గుర్తుచేసుకున్నారు. రోహిత్ త్వరలో టెస్ట్ క్రికెట్లో అద్భుతమైన పునరాగమనం చేస్తాడని తనకు పూర్తి నమ్మకం ఉండేదని, అయితే అనుకున్న విధంగా అది జరగలేదని ఉతప్ప తన అభిప్రాయాన్ని వెల్లడించారు.