వ్యక్తిగతంగా పేలవ ఫామ్.. రిటైర్మైంట్ చేయాలంటూ డిమాండ్లు.. ఇలా గతకొంత కాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు రోహిత్ శర్మ - విరాట్ కోహ్లీ. శ్రీలంకలో వన్డే సిరీస్ పరాజయం, సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్, ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఓటమి.. ఇలా అన్నింటిలోనూ జట్టుతో పాటు రోహిత్ - విరాట్ కూడా తేలిపోయారు. దీంతో మరో 9 రోజుల్లో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీనే 'రోకో'కు చివరిదని ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో.. వీరిద్దరు ఫామ్ ను అందిపుచ్చుకుని, బ్యాట్తో కచ్చితంగా రాణించాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో తిరిగి ఫామ్లోకి రావడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. దీంతో 'రోకో'లో రోహిత్ ఫామ్ లోకి వచ్చేశాడు, ఇక కోహ్లీనే బాకీ అని అభిమానులు అంటున్నారు. త్వరగా విరాట్ కూడా మునపటి ఫామ్ లోకి రావాలని కోరుతున్నారు. రోహిత్ తో పాటు విరాట్ కూడా మునపటి జోరు చూపిస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో తిరుగుండదని అంటున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీల్లో 'రోకో' గణాంకాలు ఎలా ఉన్నాయంటే?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీల్లో ఇప్పటి వరకు టీమిండియా తరఫున విరాట్ కోహ్లీ - రోహిత్ శర్మ కీలకంగా రాణించారు. అయితే పరుగులు పరంగా కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు రోహిత్ శర్మ. ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ 13 మ్యాచ్లు ఆడి.. ఐదు హాఫ్ సెంచరీల సాయంతో 529 పరుగులు నమోదు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 96 పరుగులు.
రోహిత్ పది మ్యాచ్లు ఆడి.. ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో 481 పరుగులు చేశాడు. ఇందులో హిట్ మ్యాన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 123. చూడాలి మరి ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ - రోహిత్ ఎలాంటి ప్రదర్శన చేస్తారో. ఇక ఇదే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తరఫున రోకో కన్నా ముందు శిఖర్ ధావన్ అత్యధిక పరుగులు చేశాడు. పది మ్యాచుల్లో 701 పరుగులు సాధించాడు.