ఐపీఎల్-2024 సీజన్లో పరుగుల వరద కొనసాగుతోంది. అరుణ్జైట్లీ స్టేడియంలో 504 పరుగులు నమోదైన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 257 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోరు.
ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ (84; 27 బంతుల్లో, 11x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ట్రిస్టన్ స్టబ్స్ (48*; 25 బంతుల్లో, 6x4, 2x6), షై హోప్ (41; 17 బంతుల్లో, 5x6) సత్తాచాటారు. ముంబై బౌలర్లలో బుమ్రా (1/35) మినహా మిగిలినందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు.

అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ముంబైకి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (63; 32 బంతుల్లో, 4x4, 4x,6) అద్భుతంగా పోరాడాడు. హార్దిక్ పాండ్య (46; 24 బంతుల్లో, 4x4, 3x6), టిమ్ డేవిడ్ (37; 17 బంతుల్లో, 2x4, 3x6) మెరిశారు.
అయితే ఛేదనలో రోహిత్ ఎనిమిది బంతుల్లో ఎనిమిది పరుగులే చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో రోహిత్ నిరాశపరిచినప్పటికీ అరుదైన రికార్డు సాధించాడు. ఢిల్లీ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా హిట్ మ్యాన్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది.
ఢిల్లీ జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రోహిత్ 1034 పరుగులు చేశాడు. హిట్ మ్యాన్ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి (1030 పరుగులు), అజింక్య రహానె (858 పరుగులు), రాబిన్ ఉతప్ప (740 పరుగులు), ఎంఎస్ ధోనీ (709 పరుగులు) ఉన్నారు. కాగా, కోహ్లి 28, రోహిత్ 35 మ్యాచ్ల్లో ఢిల్లీపై పరుగులు సాధించారు.