
ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు టీమిండియా రెడీ అయింది. ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తమ జట్టులో రెండు కీలక మార్పులు చేసినట్లు భారత సారధి రోహిత్ శర్మ చెప్పాడు. టాస్ గెలిచిన అనంతరం పిచ్ బాగా డ్రైగా కనిపిస్తోందని చెప్పిన అతను.. ముందుగా తాము బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. అలాగే తమ జట్టులో రెండు మార్పులు చేశామని వెల్లడించాడు. అందరూ అనుకున్నట్లే స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ను పక్కన పెట్టినట్లు తెలిపాడు.
రాహుల్ స్థానంలో శుభ్మన్ గిల్, మహమ్మద్ షమీ స్థానంలో ఉమేష్ యాదవ్ ఆడుతున్నారని రోహిత్ ప్రకటించాడు. షమీ పూర్తి ఫిట్గా లేడని, అందుకే అతని స్థానంలో ఉమేష్ ఆడుతున్నాడని చెప్పాడు. అలాగే స్టీవ్ స్మిత్ కూడా తమ జట్టులో రెండు మార్పులు చేసినట్లు చెప్పాడు. జట్టుతో లేని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్థానంలో మిచెల్ స్టార్క్ ఆడుతున్నాడని, అలాగే గాయంతో దూరమైన డేవిడ్ వార్నర్ స్థానంలో కామెరూన్ గ్రీన్ను తీసుకున్నామని చెప్పుకొచ్చాడు.
టాస్ సమయంలో రెండు జట్లు తమ ఆటగాళ్ల పేర్లు చెప్పగానే ఫ్యాన్స్ బిత్తరపోయారు. ముఖ్యంగా రోహిత్ శర్మ తమ జట్టులో మార్పుల గురించి చెప్పగానే షాకయ్యారు. ఎందుకంటే మ్యాచ్కు ఒక రోజు ముందు జరిగిన ఇంటర్వ్యూలో అతను వేరే మాటలు మాట్లాడాడు. కేఎల్ రాహుల్ చాలా సత్తా ఉన్న ఆటగాడని, అలాంటి వారికి ఎన్ని అవకాశాలైనా ఇస్తామని రోహిత్ తేల్చిచెప్పాడు. వైస్ కెప్టెన్గా రాహుల్ను తొలగించినా, దాని ప్రభావం తమపై ఏమీ ఉండదని చెప్పాడు. కానీ మ్యాచ్ మొదలయ్యే సమయానికి తన నిర్ణయాన్ని మార్చేసుకున్నాడు. రాహుల్ను పక్కన పెట్టేసినట్లు చెప్పాడు. ఇది విన్న ఫ్యాన్స్ నోరెళ్లబెట్టారు. రాహులో తోపు అని అన్ని మాటలు చెప్పిన రోహిత్.. చివరకు ఇలా చేశాడేంటి? అని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.