India vs Pakistan: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానులకు పండగే. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం(ఫిబ్రవరి 23) భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు అమీతుమీ తేల్చుకోనున్నారు. టీమిండియా పాక్ బౌలర్లు అయిన షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రవూఫ్ ల ఛాలెంజ్ ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదిని ఎదుర్కోవడానికి యూఏఈ నుంచి ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్ సహాయాన్ని భారత జట్టు తీసుకుంది.
2013లో చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్.. 2017లో తృటిలో టైటిల్ చేజార్చుకుంది. పాకిస్థాన్తో జరిగిన ఫైనల్లో కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఓటమిపాలైంది. ఈసారి పటిష్టంగా ఉన్న టీమిండియా.. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. దుబాయ్ లో జరగనున్న ఈ మ్యాచ్ గురించి భారత అభిమానులు ఆతృతగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. షాహీన్ అఫ్రిది విసిరే సవాల్ గురించి భారత జట్టుకు బాగా తెలుసు. నాలుగేళ్ల క్రితం దుబాయ్ లోనే షాహీన్ రోహిత్ శర్మను గోల్డెన్ డక్ గా.. కేఎల్ రాహుల్ ను ఒక పరుగుకు, విరాట్ కోహ్లీని 57 పరుగులకు ఔట్ చేశాడు. 2023 ఆసియా కప్ లో షాహీన్ అఫ్రిది 35 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది.

ప్రశంసలు కురిపించిన రోహిత్
ఇటీవల ఆ బౌలర్ పై రోహిత్ ప్రశంసలు కూడా కురిపించాడు. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా.. అతని బౌలింగ్ తీరు చూసి ఫిదా అయ్యాడు. నెట్స్లో రోహిత్ శర్మ అన్ని రకాల షాట్లు బాదుతూ ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలోనే స్థానిక లోకల్ పాస్ట్ బౌలర్ అవాయిస్ అహ్మద్ పదునైన బంతులను రోహిత్పై సంధించాడు. ఇన్స్వింగింగ్ యార్కర్లు సంధిస్తూ తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. దీంతో నెట్ సెషన్ పూర్తయ్యాక అతడిపై ప్రశంసలు కురిపించాడు రోహిత్ శర్మ. అతడు క్లాస్ బౌలర్ అని కొనియాడాడు. "అతడు క్లాస్ బౌలర్. నువ్వు నా కాలునే విరగ్గొట్టాలని చూస్తున్నావా. గొప్పగా బౌలింగ్ చేశావు. మీరంతా ఇక్కడ ట్రైనింగ్ లో మాకు సాయంగా ఉంటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు." అని హిట్ మ్యాన్ కొనియాడాడు.