టీ20 వరల్డ్ కప్ గెలిచి ఆలస్యంగా భారత్కు చేరిన రోహిత్ సేనకు గురువారం అపూర్వ స్వాగతం లభించింది. జూన్ 29న దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో విజయం సాధించి 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించిన టీమిండియాకు అభిమానులు అడుగడుగునా నీరాజనం పలికారు. బార్బోడస్ నుంచి ప్రత్యేకం విమానంలో భారత ఆటగాళ్లు మొదట ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అక్కడ నుంచి హోటల్కు వెళ్లారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు.
మోదీతో సమావేశంగా ముగిసిన అనంతరం ముంబైకు చేరుకున్నారు. అయితే విశ్వవిజేతలకు స్వాగతం పలకాలని అభిమానులు ముంబైకి భారీగా తరలివచ్చారు. మెరైన్డ్రైవ్ జనసంద్రాన్ని తలపించింది. ఓపెన్ టాప్ బస్సులో కొనసాగిన విజయోత్సవ ర్యాలీ చరిత్రలో నిలిచేలా సాగింది. క్రికెటర్లపై అభిమానులు పూల వర్షం కురిపించారు. మరోవైపు భారత ఆటగాళ్లు కప్ను ప్రదర్శిస్తూ అభిమానులకు అభివాదం చేశారు. వేలాది అభిమానుల మధ్య వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు.

వాంఖడేలో భారత ఆటగాళ్లకు, కోచింగ్ స్టాఫ్కు బీసీసీఐ సన్మానన కార్యక్రమం నిర్వహించింది. రూ.125 కోట్ల ప్రైజ్మనీ చెక్ అందజేసింది. అయితే ఈ క్రమంలో భారత ఆటగాళ్లు డ్యాన్స్తో అభిమానులను అలరించారు. రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లి తొలుత కాలు కదిపాడు. ఈ లోపు మిగిలిన జట్టు సభ్యులు వాళ్లతో జతకట్టారు. హార్దిక్ పాండ్య ముందుకు వచ్చి రోహిత్తో కలిసి చిందేశాడు. శివమ్ దూబె, రవీంద్ర జడేజా, సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, జైస్వాల్, పంత్ తమ స్టెప్పులతో అలరించారు.
బుమ్రా వెనుక ఉంటూ సహచర ఆటగాళ్లను ప్రోత్సహించాడు. అయితే శాంసన్ డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంది. స్టెప్పులు అంతగా రాకపోయినా కాస్త కష్టపడి టీమ్తో కలిసి శాంసన్ డ్యాన్స్ వేశాడు. దీంతో శాంసన్ డ్యాన్స్ను నెటిజన్లు ఫన్నీగా కొనియాడుతున్నారు. కష్టంగా అనిపించినా డ్యాన్స్ను మాత్రం శాంసన్ వదిలిపెట్టట్లేదని కామెంట్లు పెడుతున్నారు. కాగా, టీ20 వరల్డ్ కప్ భారత జట్టుకు శాంసన్ సెలక్ట్ అయినప్పటికీ, టోర్నీలోని అన్ని మ్యాచ్లకు బెంచ్కే పరిమితమయ్యాడు. ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు.