Rohit Sharma- Virat Kohli: ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త రానే వచ్చింది. టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఇద్దరు దిగ్గజాలు ఆస్ట్రేలియా 'ఏ' జట్టుతో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు ఇండియా 'ఏ' జట్టులో ఎంపికయ్యే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా సిరీస్కు ముందు సన్నాహాలు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు జట్టుకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు అక్టోబర్లో జరగనున్న ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోసం తమను తాము సిద్ధం చేసుకోవడానికి ఈ 'ఏ' సిరీస్ వారికి ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఈ సిరీస్ ద్వారా వారి ఫామ్, ఫిట్నెస్ను తిరిగి సాధించుకోవాలని కోరుకుంటున్నారు.

అక్టోబర్ నెలలో భారత జట్టు ఆస్ట్రేలియాలో మూడు వన్డేలు, ఐదు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడనుంది. ఈ ముఖ్యమైన పర్యటనకు ముందు రోహిత్, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయడం జట్టుకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఆస్ట్రేలియా 'ఏ' జట్టుతో ఈ సిరీస్ సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. దీంతో ఆస్ట్రేలియా టూర్ వరకు వారి రాక కోసం ఎదురుచూడాల్సిన అవసరం అభిమానులకు తప్పింది.
ఇండియా 'ఏ' వర్సెస్ ఆస్ట్రేలియా 'ఏ' వన్డే సిరీస్ షెడ్యూల్
*సెప్టెంబర్ 30: మొదటి వన్డే (గ్రీన్ పార్క్, కాన్పూర్)
*అక్టోబర్ 3: రెండవ వన్డే (గ్రీన్ పార్క్, కాన్పూర్)
*అక్టోబర్ 5: మూడవ వన్డే (గ్రీన్ పార్క్, కాన్పూర్)
ఈ సిరీస్లో మంచి ప్రదర్శన చేసి, అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో జరగబోయే మొదటి వన్డేకు రోహిత్-కోహ్లీ పూర్తి స్థాయిలో సిద్ధపడాలని చూస్తున్నారు. ఈ పర్యటనలో ఇతర రెండు వన్డేలు అక్టోబర్ 23, 25 తేదీల్లో జరుగుతాయి. వీరిద్దరి రాకతో భారత వన్డే జట్టు మరింత బలంగా తయారవుతుందని ఆశిస్తున్నారు.