టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ తన వింటేజ్ బెస్ట్ స్థాయికి చేరుకుంటున్నట్లు కనిపిస్తున్నాడు. అలవోకగా సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేసే రేంజ్లో మళ్లీ రాణిస్తాడనే నమ్మకం కలిగిస్తున్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా అతను అద్భుతంగా రాణించాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (73)తో కలిసి ఓపెనింగ్ చేసిన అతను.. 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.
వీళ్లిద్దరూ కలిసి తొలి వికెట్కు ఏకంగా 148 రన్స్ జతచేశారు. ఇది చూసిన చాలా మంది అభిమానులు, నిపుణులు కూడా ఒకే ప్రశ్న సంధిస్తున్నారు. ఇంత మంచి ఫామ్లో ఉన్న కోహ్లీని భారత జట్టుకు కూడా ఓపెనర్గా ఎందుకు పంపకూడదు? ఈ ప్రశ్నకు టీమిండియా మాజీ కోచ్, లెజెండర్ క్రికెటర్ రవిశాస్త్రి సమాధానం చెప్పాడు. విండీస్ లెజెండ్ ఇయాన్ బిషప్ ఇదే ప్రశ్న అడిగినప్పుడు రవిశాస్త్రి స్పందించాడు.

'కోహ్లీని ఓపెనర్గా పంపాలా? దీనిపై చాలా చర్చ జరుగుతోంది కదా' అని బిషప్ అన్నాడు. దీనికి బదులిచ్చిన శాస్త్రి.. 'అది ఎప్పుడూ ఒక ఆప్షనే. కానీ ఇండియాకు రోహిత్ శర్మ ఉండగా.. మరో ఓపెనర్గా లెఫ్ట్ హ్యాండర్ ఉంటే బాగుంటుందని టీం మేనేజ్మెంట్ అనుకుంటుంది. రోహిత్, విరాట్ కలిసి ఓపెనింగ్ చేస్తే.. టాపార్డర్పై మరీ భారం పడినట్లు అవుతుంది. మిడిలార్డర్లో బలం తగ్గుతుంది. అయితే వీళ్లిద్దరూ కలిసి ఆడిన ప్రతిసారీ అద్భుతంగా ఆడారు' అని చెప్పాడు.
రోహిత్, కోహ్లీ జోడీ ఇప్పటి వరకు వన్డేల్లో ఎప్పుడూ ఓపెనింగ్ చేయలేదు. అయితే 2021లో ఇంగ్లండ్తో జరిగిన ఐదో టీ20లో మాత్రం వీళ్లిద్దరూ ఓపెనర్లుగా వచ్చారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్ (64), కోహ్లీ (80 నాటౌట్) రెచ్చిపోయారు. తొలి వికెట్కు 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అప్పటి నుంచి వీళ్లిద్దర్నీ ఓపెనర్లుగా పంపాలనే వాదన మరింత బలంగా వినిపిస్తోంది.