
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించింది. అయితే స్లిప్ ఫీల్డింగ్ మాత్రం సమస్యాత్మకంగా కనిపించింది. ముఖ్యంగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన పొరపాట్లతో వార్తల్లో నిలిచాడు. ఆట మొదలైన తొలి రోజున ఆసీస్ కీలక బ్యాటర్లు స్టీవ్ స్మిత్, పీటర్ హాండ్స్కోంబ్ ఇద్దరికీ అతని వల్ల జీవనదానాలు లభించాయి. అయితే వాళ్లు దీన్ని క్యాష్ చేసుకోలేకపోవడం వేరే విషయం.
అలాగే మూడో రోజున ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో కూడా కోహ్లీ ఇలాగే చెత్త ఫీల్డింగ్ చేశాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్కు వచ్చిన తర్వాత భారత స్పిన్నర్లు ఆ జట్టుపై దాడికి దిగారు. ఈ క్రమంలోనే ఆరో ఓవర్లో అశ్విన్ వేసిన ఫ్లయిటెడ్ డెలివరీని వార్నర్ డిఫెండ్ చేసుకోబోయాడు. అయితే అతను సరిగా డిఫెన్స్ ఆడలేదు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్స్లో ఉన్న కోహ్లీ వైపు వెళ్లింది. మంచి ఎత్తులో వచ్చిన ఆ బంతిని కోహ్లీ పట్టేస్తాడని అంతా అనుకున్నారు.
కానీ ఈ సమయంలో తత్తరపడిన కోహ్లీ.. క్యాచ్ కంప్లీట్ చేయలేకపోయాడు. అతని మణికట్టుపై పడిన బంతి కింద పడిపోయింది. ఇది చూసిన అశ్విన్, కెప్టెన్ రోహిత్.. దాన్ని నమ్మలేకపోయారు. ఇంత సింపుల్ క్యాచ్ ఎలా వదిలేస్తావ్? అన్నట్లు కోహ్లీ వైపు చూశారు. కామెంటరీ బాక్సులో ఉన్న సునీల్ గవాస్కర్ దీనిపై మాట్లాడుతూ.. 'ఆ క్యాచ్ పట్టడానికి కోహ్లీ కొంత ఆత్రపడ్డాడు' అని చెప్పాడు. మాజీ కోచ్ రవిశాస్త్రి అయితే రోహిత్, అశ్విన్లను చూపిస్తూ.. వాళ్లు దీన్ని నమ్మలేకపోతున్నారని అన్నాడు.
ఏదేమైనా అంతకుముందు కూడా కోహ్లీ ఇలాగే స్లిప్స్లో క్యాచులు నేలపాలు చేశాడు. అతని టెక్నిక్ ఏమాత్రం బాగలేదని, ప్రతిస్పందనలు కూడా చాలా నెమ్మదిగా ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మార్క్ వా విమర్శించాడు. కోహ్లీ కాళ్లు చాలా దూరంగా పెట్టి, కిందకు వంగకుండా నిలబడుతున్నాడని వివరించాడు. అసలు బంతి తన వద్దకు వస్తుందని అతను ఏమాత్రం ఊహించడం లేదని విమర్శించాడు.