
విరాట్ కోహ్లీని టీ20ల్లో భారత్కు ఓపెనింగ్ బ్యాటర్గా కొనసాగిస్తే బెటర్గా ఉంటుందని, అందుకు కేఎల్ రాహుల్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుందని మాజీ ఎడమచేతి వాటం బ్యాటర్ రోహన్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇటీవల ఆసియాకప్ సూపర్ 4లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన చివరి మ్యాచ్లో కోహ్లీ ఓపెనింగ్లో దిగి 61బంతుల్లో 12ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 122పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించిన సంగతి తెలిసిందే. అతని దెబ్బకు భారత్ రెండు వికెట్ల నష్టానికి 212పరుగులు చేసింది.
ఆ తర్వాత ఆఫ్ఘన్ చేతులేత్తెయడంతో భారత్ 101పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. ఇక ఈ విషయమై రోహన్ గవాస్కర్ మాట్లాడుతూ.. కోహ్లీని రెగ్యులర్గా ఓపెనింగ్ చేయించేలా చూడడం మంచి ఆప్షన్ అవుతుంది. అందువల్ల రాహుల్ డౌన్ ఆర్డర్లోకి వెళ్లాల్సొస్తుందని రోహన్ పేర్కొన్నాడు. భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ నెం.3లోనే బ్యాటింగ్ చేయాలని, అదే పర్ఫెక్ట్ పొజిషన్ అని పేర్కొన్నాడు.
'చూడండి. విరాట్ ఓపెనింగ్గా బ్యాటింగ్ చేయడమే గొప్ప ఎంపిక అని నేను భావిస్తున్నాను.

మీరు అతని టీ20నంబర్లను ఒకసారి చూస్తే.. ఓపెనర్గా అతని గణాంకాలు చాలా బాగున్నాయి. సగటు 55-57గా ఉంది. స్ట్రైక్ రేట్ కూడా దాదాపు 160గా ఉంది. అలాగే అతని చివరి ఇన్నింగ్స్ ఒక్కసారి తరిచి చూస్తే.. 122పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్.. వాహ్ అతను బహుశా ఓపెనింగ్ను చాలా బాగా ఇష్టపడతాడని ఈ గణాంకాలు మీకు చెబుతున్నాయి.' అని గవాస్కర్ పేర్కొన్నాడు.
ఇకపోతే సరైన సమయంలో కోహ్లీ తన ఫామ్ అందుకున్నాడని గవాస్కర్ పేర్కొన్నాడు. మరో రెండు నెలల్లో ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ పాల్గొననుంది. మెగా ఈవెంట్కు ముందు కోహ్లీ ఫామ్లోకి రావడం భారత్కు గొప్ప సంకేతమని గవాస్కర్ అన్నాడు. ఆఫ్ఘన్పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ 2016 నాటి విరాట్ కోహ్లీని గుర్తుకుతెచ్చింది. ఇక అతన్ని ఆపడం ఎవరి తరము కాదు అంటూ కొనియాడాడు.