
భారత టీ20 టీంలో అవేశ్ ఖాన్కు చోటు కల్పించడమేంటని భారత మాజీ బ్యాటర్ రోహన్ గవాస్కర్ ప్రశ్నలు కురిపించాడు. అవేశ్ ఖాన్ టీ20ప్రపంచకప్కు భారత ప్లేయింగ్ 11కి అసలే సెట్ కాడని చెప్పాడు. అవేష్ ఖాన్ ఇటీవల హాంకాంగ్ మ్యాచ్లో తన నాలుగు ఓవర్ల స్పెల్లో 53పరుగులిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కూడా అవేష్ ఖాన్ తాను వేసిన రెండు ఓవర్లలో 19పరుగులు సమర్పించుకున్నాడు.
'టీ20 ప్రపంచ కప్ టైంకు అవేష్ ఖాన్ తన ప్రదర్శనను మెరుగుపరుచుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అవేష్ ఇప్పటివరకు చేసిన దాని గురించి నేను ఏం బాధపడను కూడా. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పగలను. సెలెక్టర్ల మనస్సులలో ఏముందో తెలియదు. కానీ చాలా మంది అనుకుంటుందే నేను చెబుతున్నాను. అతను ప్రస్తుతం టీమిండియా ప్లేయింగ్ 11కి సరిపోడు' అని రోహన్ గవాస్కర్ స్పోర్ట్స్ హబ్ రోజువారీ స్పోర్ట్స్ న్యూస్ షో 'స్పోర్ట్స్ ఓవర్ ది టాప్'లో అన్నాడు. టీ20 ప్రపంచకప్ టైంకు జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి ఎలాగూ వస్తాడని, బుమ్రా భువీ పేస్ అటాక్ను చూసుకుంటారని గవాస్కర్ పేర్కొన్నాడు. ఇక టీ20 వరల్డ్ కప్ జట్టులో అవేష్ ఖాన్ కన్నా దీపక్ చాహర్, హర్షల్ పటేల్ లాంటి వారికి ప్రాధాన్యతనిచ్చే అవకాశాలను పరిశీలించాలని గవాస్కర్ పేర్కొన్నాడు.
ఇకపోతే ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యంత ఎక్కువ ఎకానమీతో టీ20ల్లో ఇండియా తరఫున బౌలింగ్ చేసిన బౌలర్గా అవేశ్ ఖాన్ అతి చెత్త రికార్డు నమోదు చేశాడు. అతని ఎకానమీ 9.10గా ఉంది. అయినా కానీ అతనికి అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. వన్డేల్లోనూ, టీ20ల్లోనూ రెగ్యులర్ ప్లేయర్లాగా తీసుకోవడంతో సెలెక్షన్ కమిటీపై నెటిజన్లు సీరియస్ అవుతూనే ఉన్నారు.