
లండన్: స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ శకం ముగిసింది. తన కెరీర్లో చిట్ట చివరి మ్యాచ్ ఆడేశాడు. ఓటమితో ముగింపు పలికాడు. తన చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్తో కలిసి ఆడిన డబుల్స్లో పరాజయాన్ని చవి చూశాడు. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే తన కేరీర్కు ముగింపు పలికినట్లు అధికారికంగా ప్రకటించాడు. ఆ మాట చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యాడు ఫెదరర్. అతన్ని ఈ స్థితిలో చూసిన రాఫెల్ నాదల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
లండన్లో జరిగిన డబుల్స్ మ్యాచ్లో నాదల్-ఫెదరర్ జోడీపై జాక్ సాక్- ఫ్రాన్సిస్ టియాఫో 4-6 7-6 11-9 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తరువాత ఫెదరర్ తన టీమ్తో పాటు ఇతర ప్లేయర్లతో కరచాలనం చేశాడు. భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీరు పెట్టుకున్నాడు. టెన్నిస్తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. భార్య, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుకొన్నాడు. వారి సపోర్ట్తోనే కేరీర్లో ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నాడు.
ఫెదరర్ మాట్లాడుతున్నంత సేపూ అతని చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్ కన్నీరు పెట్టుకుంటూనే కనిపించడు. నోవాక్ జొకోవిచ్ కూడా ఫెదరర్ను చూస్తూ కన్నీటి పర్యంతం అయ్యాడు. టెన్నిస్ కోర్టులో కొదమసింహాల్లా కలబడే ఇద్దరు చిరకాల ప్రత్యర్థులు ఒకేచోట కన్నీరు పెట్టుకోవడం.. క్రీడా స్ఫూర్తిని చాటింది. పలువురు క్రీడాకారులు దీనిపై స్పందించారు. రోజర్ ఫెదరర్కు ఆత్మీయ వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
టీమిండియా మాజీ కేప్టెన్ విరాట్ కోహ్లీనీ కదిలించిందీ ఉదంతం. రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్ ఒకే ఫ్రేమ్లో ఉన్న ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఇది తనకు బాగా కదలించిన, నచ్చిన స్టోర్టివ్ పిక్గా అభివర్ణించారు. ఇద్దరు చిరకాల ప్రత్యర్థులు ఇలా భావోద్వేగాలకు గురి అవుతారని ఎవరు ఊహించారు.. అని కామెంట్స్ చేశాడు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ స్పోర్ట్ అని పేర్కొన్నాడు. తన గురించి తన ప్రత్యర్థి బాధపడుతున్నాడంటే అది దేవుడిచ్చిన టాలెంట్ వల్లేనని కామెంట్స్ చేశాడు. మొత్తంగా మూడు ఫొటోలను అతను పోస్ట్ చేశాడు.