BCCI: రోజర్ బిన్నీ 2022 నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ ఆయన పదవీకాలం త్వరలో ముగియనుంది. రోజర్ బిన్నీ జులై 19న పదవీ విరమణ చేయనున్నారు. వాస్తవానికి ఆ రోజున ఆయనకు 70 సంవత్సరాలు నిండుతాయి. బీసీసీఐ అధికారులు 70 సంవత్సరాల తర్వాత పదవికి రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే. ఈ క్రమంలో తదుపరి బీసీసీఐ అధ్యక్షుడు ఎవరు అనేది తెరపైకి వచ్చింది.
బీసీసీఐ నూతన అధ్యక్షుడు ఎవరు?
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆ పదవిని చేపట్టవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఆయనను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉంది."రోజర్ బిన్నీ పదవీకాలం జులై 19న ముగిసిన తర్వాత రాజీవ్ శుక్లాను తాత్కాలిక అధ్యక్షుడిగా చేయవచ్చు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో నూతన బీసీసీఐ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు." అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మాజీ జర్నలిస్ట్, రాజ్యసభ ఎంపీ రాజీవ్ శుక్లా భారత జట్టుతో చాలా కాలంగా అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన బీసీసీఐలో అనేక హోదాల్లో పనిచేశారు. రాజీవ్ శుక్లా ఆటగాళ్లతో కూడా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. ప్రతి పెద్ద మ్యాచ్లో స్టేడియంలో అందుబాటులో ఉంటారు. ఆయన ఈ పదవికి తగినవారు కావడంతో పాటు రేసులో కూడా ముందంజలో ఉన్నారు. సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి రాజీవ్ శుక్లా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

రోజర్ బిన్నీ క్రికెట్ లైఫ్ ఇలా..
జులై 19, 1955న మైసూర్లో జన్మించిన రోజర్ బిన్నీ 1983 ప్రపంచ కప్ విజేత జట్టులో ముఖ్యమైన ఆటగాడు. భారత్ తరఫున క్రికెట్ ఆడిన స్కాటిష్ మూలానికి చెందిన మొదటి ఆంగ్లో ఇండియన్. ఆయన 27 టెస్టులు, 72 వన్డేల్లో వరుసగా 47, 77 వికెట్లు పడగొట్టారు. ఆయన 49 వన్డేల్లో 629 పరుగులు, 41 ఇన్నింగ్స్లలో 830 పరుగులు చేశారు. రోజర్ బిన్నీ 2022 అక్టోబర్ 18న బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు ఆయన కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 3 ఏళ్లు(3 అక్టోబర్ 2019 నుండి 18 అక్టోబర్ 2022 వరకు) ఉన్నారు.
బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ పదవీ విరమణ చేసే సమయంలో టీమిండియా ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ ఆడనుంది. అక్కడ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతూ ఉంటుంది. దీనిలో మొదటి మ్యాచ్ జూన్ 20న జరుగుతుంది. సిరీస్లోని మూడవ టెస్ట్ జూలై 10-14 తేదీలలో జరుగుతుంది. ఆ తర్వాత నాల్గవ టెస్ట్కు ముందు రోజర్ బిన్నీ రిటైర్ అవుతారు.