మెల్బోర్న్: వరుస ఓటములతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆసీస్ వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ఆ జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ రాడ్ మార్ష్ తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా-దక్షిణఫ్రికా మధ్య మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆసీస్పై 0-2తేడాతో దక్షిణాఫ్రికా టెస్టు సిరిస్ను కైవసం చేసుకున్న నేపథ్యంలో రాడ్ మార్ష్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.
మే 2, 2014లో క్రికెట్ ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన రాడ్ మార్ష్ 2017 జూన్ వరకు పదవిలో కొనసాగాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత జట్టు వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బోర్డు సమావేశ అనంతరం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది తన సొంత నిర్ణయమని దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని.. రాజీనామా చేయమని ఎవరూ తనకు సలహా కూడా ఇవ్వలేదని మార్ష్ పేర్కొన్నాడు. ఆసీస్ క్రికెట్ అంటే తనకు ఎంతో ఇష్టమని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.
రెండున్నరేళ్లగా తన పదవిలో ఎంతో ఎంజాయ్ చేశానని తెలిపాడు. కోచ్కు, కో-సెలక్టర్లకు, ఆటగాళ్లందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తన హయాంలో 2015 వరల్డ్ కప్ గెలవడంతో పాటు జట్టు సాధించిన విజయాలకు తాను ఎంతో థ్రిల్గా ఫీలయ్యానని చెప్పుకొచ్చాడు.

మరోవైపు క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్ డేవిడ్ పివర్ మాట్లాడుతూ రాడ్ మార్ష్ సేవలను కొనియాడారు. ఆస్ట్రేలియా క్రికెట్ను అభివృద్ధి బాటలో నడిపించారని, అటు టెస్టులతో పాటు వన్డేల్లో కూడా టాప్ పొజిషన్లో నిలబెట్టడంలో మార్ష్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
1970 నుంచి 1984 సుమారు పద్నాగేళ్లు పాటు రాడ్ మార్ష్ ఆస్ట్రేలియా జట్టు తరుపున ఆడాడు. 1990-2001 మధ్య కాలంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కామన్ వెల్త్ బ్యాంక్ క్రికెట్ అకాడమీ ద్వారా అత్యుత్తమ క్రికెటర్లను అందించడంలో రాడ్ మార్ష్ కీలక పాత్ర పోషించాడు.
రికీ పాంటింగ్, ఆడమ్ గిల్ క్రిస్ట్, షేన్ వార్న్, గ్లెన్ మెక్ గ్రాత్ లాంటి క్రికెటర్లతో పాటు సుమారు 27 మంది అత్యుత్తమ క్రికెటర్లను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు అందించాడు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా జట్టు అత్యంత చెత్త ప్రదర్శనను కనబరుస్తోంది.
వరుసగా ఐదు టెస్టు మ్యాచ్లను ఓడిపోయింది. తాజాగా హోబర్ట్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 80 పరుగుల తేడాతో అతి పెద్ద పరాజయాన్ని చవిచూసింది. దీంతో గే చివరి డే-నైట్ టెస్టుకు గాను పలువురు క్రికెటర్లపై క్రికెట్ ఆస్ట్రేలియా వేటు వేసింది.