దాదాపు నాలుగు నెలలు గడిచినప్పటికీ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వివాదం కొనసాగుతూనే ఉంది. పదేళ్ల కాలంలో అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను సారథి బాధ్యతల నుంచి ఎలా తప్పిస్తారు? హార్దిక్ పాండ్యనే ఎందుకు కెప్టెన్గా ఎంపిక చేశారు? కండిషన్స్తోనే గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ ముంబై గూటికి చేరాడా? ఇలా ఎన్నో ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు.
క్రికెట్ విశ్లేషకులు, మాజీ ప్లేయర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా టీమిండియా మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప ముంబై కెప్టెన్సీ మార్పు గురించి మాట్లాడాడు. ముంబై ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయానికి కారణాలను తన కోణంలో వివరించాడు. 2013 సీజన్ మధ్యలో రికీ పాంటింగ్ నుంచి రోహిత్ శర్మ సారథి బాధ్యతలు అందుకోవడాన్ని గుర్తు చేస్తూ ముంబై ఫ్రాంచైజీ, హార్దిక్ పాండ్యకు సపోర్ట్ చేశాడు.

''ముంబై ఇండియన్స్ స్వచ్ఛమైన ప్లేయర్ కావాలనే ఆలోచనతో హార్దిక్ పాండ్యను ఎంపిక చేసింది. గతంలో సీజన్ మధ్యలోనే రికీ పాంటింగ్ నుంచి రోహిత్ శర్మ జట్టు పగ్గాలు అందుకున్నాడు. అప్పుడు ఇదే ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. రోహిత్కు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, హర్భజన్ సింగ్ వంటి సీనియర్లు అందరూ మద్దతు ఇచ్చారు''
''గత నాలుగేళ్ల గణాంకాల ప్రకారం రోహిత్ శర్మ బ్యాటింగ్ సామర్థ్యాన్ని, వైభవాన్ని నేను ప్రశ్నించను. కానీ ముంబై ఇండియన్స్ కోణంలో ఆలోచించండి. 2020లో టైటిల్ సాధించిన తర్వాత ముంబై మరో గొప్ప ప్రదర్శన చేయలేకపోయింది. రోహిత్ కూడా సగటున ఏడాదికి 300 పరుగులు మాత్రమే చేస్తున్నాడు. కాబట్టి బ్యాటర్గా, అలాగే సారథిగా రోహిత్ విజయవంతం కాలేకపోయాడు''
''ఇవన్నీ ఆలోచించి ఫ్రాంచైజీ కెప్టెన్సీ మార్పుపై నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. అలాగే గత సీజన్ ముగిసినప్పుడే దీని గురించి ఫిక్స్ అయ్యి ఉంటారు. ఇది సరైన నిర్ణయమే అని ఫ్రాంచైజీకి అనిపిస్తుంటుంది. గతంలో, ఇప్పుడూ వాళ్లు అదే చేశారు. వాళ్ల ఆలోచన స్థిరంగా ఉంది. కాబట్టి మనం తప్పుబట్టలేం'' అని రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు.