
ముంబై: ఒమన్, యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2021 తుది అంకానికి చేరుకొంది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ను ఓడించిన న్యూజిలాండ్ ఇప్పటికే ఫైనల్లో అడుగుపెట్టింది. మరో స్థానం కోసం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు గురువారం దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప జోస్యం చెప్పాడు. ఈరోజు పాకిస్థాన్ ఫైనల్ చేరుతుందని చెప్పాడు. ప్రస్తుత ప్రపంచకప్లో రెండు జట్లు బాగా ఆడుతున్నాయన్నాడు. అయితే పాక్ ఆడిన అన్ని మ్యాచ్ల్లో గెలిచి ముందుకుసాగుతోందని, అందుకే బాబర్ సేన ఫేవరెట్గా బరిలోకి దిగుతోందని ఉతప్ప పేర్కొన్నాడు.
పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ గురువారం దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనుంది. ఈరోజు రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుండగా.. రాత్రి 7 గంటలకు టాస్ పడనుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానెల్లలో రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ను వివిధ భాషలలో చూడవచ్చు. అలానే డిస్నీ+హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ సబ్స్క్రిప్షన్తో మ్యాచ్ను ఫాన్స్ ఆన్లైన్లో వీక్షించవచ్చు. సెమీఫైనల్ జరగనున్న దుబాయ్ పిచ్పై టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్లు నిర్వహించారు. బ్యాటింగ్కు అనుకూలమైన ఈ పిచ్పై మంచు ప్రభావం చూపొచ్చు. టాస్ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం.
టీ20 ప్రపంచకప్లో రెండుసార్లు ఫైనల్స్కు చేరిన పాకిస్థాన్.. 2009తో ఛాంపియన్గా నిలిచింది. మరోవైపు ఐదుసార్లు వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టీ20 ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలువలేకపోయింది. అందుకే ఈ సారి ఎలాగైనా కప్ను గెలవాలనే కసితో బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు మొత్తం 22 టీ20 మ్యాచ్లు జరగ్గా.. పాక్ 13, ఆసీస్ 9 మ్యాచ్లు గెలిచింది. టీ20 ప్రపంచకప్లలో ఇప్పటివరకు ఇరుజట్లు ఆరుసార్లు తలపడ్డాయి. ఇందులో పాకిస్థాన్ మూడు, ఆస్ట్రేలియా మూడు మ్యాచ్లు గెలిచాయి. ఇరు జట్లు చివరిసారిగా 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్లో తలపడ్డాయి. ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వగా.. మొహాలీలో జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా గెలిచింది.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'కూ'లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగునున్న రెండో సెమీ ఫైనల్లో బాబర్ సేన ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. పాక్ ఫైనల్కి వెళుతుంది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో పాక్ మాత్రమే అజేయంగా కొనసాగుతోంది. అది పాక్కు కలిసొస్తుందో లేదో తెలియదు. కానీ అదే జోరుని కొనసాగిస్తే మాత్రం విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. మరోవైపు ఆస్ట్రేలియా కూడా మెరుగ్గా రాణిస్తోంది. వాళ్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తమదైన రోజున ఎంతటి బలమైన జట్టునైనా ఓడించగలదు. ప్రత్యేకించి ఐసీసీ టోర్నీల్లో ఆసీస్ జట్టుకు గొప్ప రికార్డుంది. ఆసీస్ ఓపెనర్లు మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్ విభాగం కూడా బలంగా కనిపిస్తోంది' అని అన్నాడు.