
ద్రవిడ్, ధోనీ కెప్టెన్సీలో:
టీమిండియాకి ఆడే సమయంలో రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోనూ రాబిన్ ఊతప్ప మ్యాచ్లు ఆడాడు. ఇక ఐపీఎల్లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో ఆడాడు. అయితే ఈ ముగ్గురిలో మీ బెస్ట్ కెప్టెన్ ఎవరు? అని అడగ్గా.. గంభీర్ అని ఊతప్ప సమాధానమిచ్చాడు. అయితే ద్రవిడ్, ధోనీలను కాదని గంభీర్నే ఎందుకు ఎంచుకున్నాడో వివరణ ఇచ్చాడు. మైదానంలో గౌతీ ఎక్కువగా మాట్లాడడు కానీ.. కమ్యూనికేట్ మాత్రం బాగా చేస్తాడన్నాడు. కోల్కతా నైట్రైడర్స్ టీమ్కి గంభీర్ కెప్టెన్గా ఉన్న విషయం తెలిసిందే.

గంభీర్ నా ఫేవరెట్ కెప్టెన్:
తాజాగా రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ... 'గౌతమ్ గంభీర్ నా బెస్ట్ కెప్టెన్. మైదానంలో గౌతీ ఎక్కువగా మాట్లాడడు. కానీ ఆటగాళ్లకు అవసరమైనంత మేర కమ్యూనికేట్ చేస్తాడు. ప్లేయర్లకు అవసరమైంది మాత్రమే చెపుతాడు. గంభీర్ లాంటి మంచి కెప్టెన్ ఉంటే.. జట్టులో ఎవరూ ఎలాంటి అభద్రతా భావానికి లోనవ్వాల్సిన అవసరం ఉండదు. ఐపీఎల్లో గంభీర్ కెప్టెన్సీలో ఎలాంటి ఫలితాలు వచ్చాయో మన అందరికి తెలుసు' అని ఊతప్పపేర్కొన్నాడు.

177 ఐపీఎల్ మ్యాచ్లు:
గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో కోల్కతా నైట్రైడర్స్ 2012, 2014లో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక 2014 నుంచి 2019 వరకూ కోల్కతా తరఫున రాబిన్ ఊతప్ప మ్యాచ్లు ఆడాడు. ముఖ్యంగా 2014 ఐపీఎల్ సీజన్లో వెటరన్ ఓపెనర్ దుమ్ములేపాడు. 138 స్ట్రైక్రేట్తో 660 పరుగులు చేసాడు. అయితే ఐపీఎల్ 2020 సీజన్ వేలం ముంగిట ఊతప్పను కోల్కతా వదులుకోగా.. రాజస్థాన్ రాయల్స్ రూ. 3 కోట్లకి కొనుగోలు చేసింది. ఇప్పటి వరకూ 177 ఐపీఎల్ మ్యాచ్లాడిన ఊతప్ప.. 4,411 పరుగులు చేసాడు. అందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇంకో ప్రపంచకప్ ఆడుతా:
'నాలో భారత్ తరఫున ఆడాలనే కసి ఇంకా అలానే ఉంది. తప్పకుండా సత్తా చాటగలను. టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున ప్రపంచకప్కు మరోసారి ప్రాతినిధ్యం వహిస్తానన్న నమ్మకం ఉంది. దానికి అదృష్టం, దేవుడి ఆశీర్వాదం కూడా కావాలి. భారత్లో ఇది ఎంతో ముఖ్యం, ఇతర దేశాల్లో అయితే పెద్దగా అవసరం లేదు. అంతేకాక మనపై మనం విశ్వాసం ఉంచుకోవాలి. సానుకూల ధోరణితో ఉండాలి. సామర్థ్యం ఉందని భావించాలి' అని ఉతప్ప అన్నాడు.


Click it and Unblock the Notifications












