
హైదరాబాద్: అవసరమైతే నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్సీ తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నానని రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. ఏడు సంవత్సరాలుగా జట్టులో కొనసాగిన గౌతం గంభీర్ ఇంతకుముందు జరిగిన పది సీజన్ల వరకు జట్టుకు నాయకత్వం వహించాడు. ఇప్పుడు అతన్ని జట్టు అట్టి పెట్టుకోకుండా వేలానికి వదిలేయడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సొంతం చేసుకుంది.
దీంతో పదకొండో సీజన్లో నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్సీ ఎవరు వహిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్ చరిత్రలో కేవలం రెండు సార్లు మాత్రమే టైటిల్ను గెలుచుకున్న జట్టు ఈ సారి టైటిల్ పోరుకు భారీ ప్రణాళికలతో సిద్ధమవుతుంది. యువ క్రికెటర్లే జట్టుకు బలం అనే తరహాలో ప్రణాళిక సిద్ధం చేసింది.
అయితే ఈ జట్టుకు నాయకుడిగా ఉండమని చెబితే తప్పకుండా తాను బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పకనే చెప్తున్నాడు రాబిన్ ఊతప్ప. ఇతనిని సైతం వేలంలోకి వదిలిపెట్టేసిన నైట్ రైడర్స్ జట్టు రైట్ టు మ్యాచ్ కార్డ్ ద్వారా తిరిగి రూ. 6.4కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు జట్టులో ఊతప్పతో పాటుగా, దినేశ్ కార్తీక్, క్రిస్ లిన్ ఉన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ' జట్టు నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. నాకు జట్టులో ఏ పదవి ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. బాధ్యతను 110 శాతం నిర్వర్తించేందుకు కష్టపడతాను.' అని పేర్కొన్నాడు. జట్టులో చాలా వరకు యువ క్రికెటర్లే ఉన్నారు. దీంతో టోర్నీలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం కాయమని ఊతప్ప పేర్కొన్నాడు. కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టుకు మంచి భవిష్యత్తు ఉందని కొనియాడాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.