
హైదరాబాద్: ఐపీఎల్లో భాగంగా జరిగిన హోరాహోరీ పోరులో టాస్ ఓడి దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన ముంబై జట్టే విజయాన్ని కైవసం చేసుకుంది. ప్లేఆఫ్ కోసం ఆరాటపడిన ముంబై ఆశలకు జీవం పోశారు బ్యాట్స్మెన్లు. అయితే కోల్కతా నైట్రైడర్స్ జట్టు సైతం అంతే స్థాయిలో పోరాటం చేసింది. చేధనకు దిగిన కోల్కతా జట్టులో స్టార్ బ్యాట్స్మన్ రాబిన్ ఊతప్ప హైలెట్గా నిలిచాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు.
ఐపీఎల్లో నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆరో క్రికెటర్గా ఊతప్ప నిలిచాడు. ఆదివారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా ఈ సీనియర్ క్రికెటర్ ఫీట్ అందుకున్నాడు. ఊతప్ప 159 మ్యాచ్ల్లో 29.25 సగటుతో 4037 పరుగులు చేశాడు. రైనా(170 మ్యాచ్లు, 4801 పరుగులు), కోహ్లీ(158 మ్యాచ్లు, 4775 పరుగులు), రోహిత్శర్మ(169 మ్యాచ్లు, 4438 పరుగులు), గంభీర్(154 మ్యాచ్లు, 4217 పరుగులు) రాబిన్ కంటే ముందు వరుసలో ఉన్నారు.
ఊతప్ప దూకుడు సాగిందిలా:
మెక్లెనగన్ తొలి ఓవర్లో మూడు పరుగులే ఇచ్చాడు. తన రెండో ఓవర్లో లిన్ (17)ను పెవిలియన్ చేర్చాడు. మరోవైపు హార్దిక్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. తన తొలి బంతికే గిల్ (7)ను ఔట్ చేశాడు. ఈ దశలో ఉతప్ప, నితీశ్ రాణా (31) కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. 4 పరుగుల దగ్గర మార్కండే క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన ఉతప్ప ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. చూడచక్కని షాట్లు ఆడాడు. ఉతప్ప, రాణాల ధాటికి 11.3 ఓవర్లలోనే స్కోరు వందకు చేరడంతో కోల్కతా విజయం సాధించేలాగే కనిపించింది. ఐతే ప్రమాదకరంగా మారుతున్న ఉతప్పను ఔట్ చేసిన మార్కండె మ్యాచ్ను మలుపు తిప్పాడు.
చివరి ఐదు ఓవర్లలో 60 పరుగుల చేయాల్సి రాగా.. కెప్టెన్ కార్తీక్ (36), ఆండ్రీ రస్సెల్ ఉండడంతో నైట్రైడర్స్ ఆశలు వదులుకోలేదు. కానీ రస్సెల్ (9)ను బుమ్రా పెవిలియన్ చేర్చడం.. కార్తీక్ ఆశించినంత వేగంగా ఆడకపోవడంతో కోల్కతాకు పరాజయం తప్పలేదు. చివరి ఓవర్లో 23 పరుగులు చేయాల్సి ఉండగా.. దినేశ్ క్రీజులో ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. సాధారణ ప్రదర్శనే కనబర్చి 10 పరుగులు మాత్రమే రాబట్టారు.