
స్టార్ క్రికెటర్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి భారీ చోరీకి పాల్పడ్డారు. ఆ ఇంటి నుంచి 20 వేల డాలర్ల విలువైన డబ్బును దోచుకెళ్లారు. ఇది జరిగింది పాకిస్తాన్లో. పాక్ మాజీ సారధి, స్టార్ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్ ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఈ విషయంపై హఫీజ్ భార్య తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనానికి సంబంధించిన వీడియో కూడా ఉండటంతో త్వరలోనే దొంగను పట్టుకుంటామని పోలీసులు చెప్పారట.
ప్రస్తుతం పాకిస్తాన్లో ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. ఎవరి దగ్గరైనా గోధుమ పిండి బస్తా ఉంటే వారిపై దాడి చేసి దాన్ని కాజేసే పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే ధనవంతుల ఇళ్లను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు మహమ్మద్ హఫీజ్ ఇంటిపై కూడా దాడి చేసి భారీ దొంగతనం చేశారు. పాకిస్తాన్లో ఒక అమెరికా డాలర్ విలువ రూ.276 పాక్ రూపాయలు. ఈ లెక్కన 20 వేల డాలర్ల డబ్బు పోయిందంటే.. హఫీజ్ ఇంటి నుంచి 55 లక్షలపైగా పాకిస్తానీ రూపాయలను దొంగలు కాజేశారన్నమాట.
ప్రస్తుతం హఫీజ్ చాలా బిజీగా ఉన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున అతను ఆడుతున్నాడు. ఈ జట్టు కూడా అంత గొప్ప ప్రదర్శన చేయడం లేదు. పీఎస్ఎల్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. తాజాగా పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్లో మార్టిన్ గప్తిల్ రాణించడంతో గ్లాడియేటర్స్ గెలిచారు. ఈ మ్యాచ్ గెలిచినా కూడా గ్లాడియేటర్స్ జట్టు నాకౌట్స్ చేరడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఆడిన మ్యాచుల్లో క్వెట్టా గ్లాడియేటర్స్ కేవలం రెండు మ్యాచులే గెలిచారు. మిగతా వాటన్నింటిలో ఓడారు. దీంతో ఒత్తిడిలో ఉన్న హఫీజ్కు ఇలా ఇంట్లో దొంగలు పడ్డారని తెలిసి మరింత చిరాకు పెరగడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.