
రాయ్పూర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్లో భాగంగా మంగళవారం రాత్రి ఇంగ్లండ్ లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో థ్రిల్కు గురిచేసింది. ఆఖరి బంతి వరకు ఇరు జట్ల మధ్య విజయం దోబుచులాడింది. విండీస్ విజయానికి ఒక్క పరుగు దూరంలో బ్రియాన్ లారా వికెట్ కోల్పోవడం.. ఆ తర్వాత టినో బెస్ట్ సూపర్ ఓవర్కు అవకాశం ఇవ్వకుండా సింగిల్ తీయడంతో విండీస్ లెజెండ్స్ సెమీస్లోకి అడుగుపెట్టింది. శనివారం దక్షిణాఫ్రికా లెజెండ్స్ను 56 పరుగుల తేడాతో ఓడించి ఇండియా లెజెండ్స్ కూడా సెమీఫైనల్కి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ లెజెండ్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్ పీ మస్టర్డ్ (57; 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు), కెవిన్ పీటర్సన్ (38; 24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులతో శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన ఒవైసీ షా (30 బంతుల్లో 53, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ లెజెండ్స్కు ఓపెనర్ డ్వేన్ స్మిత్ శుభారంభం అందించాడు. 31 బంతుల్లో 58 పరుగులు చేయగా.. వన్డౌన్లో వచ్చిన నర్సింగ్ డియోనారైన్ 53 పరుగులతో నాటౌట్గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు.
34 పరుగులు చేసిన కిర్క్ ఎడ్వర్డ్స్ 19వ ఓవర్లో వెనుదిరగడంతో ఆఖర్లో టెన్షన్ మొదలైంది. ఆ తర్వాత వచ్చిన బ్రియాన్ లారా కూడా 20వ ఓవర్ ఐదో బంతికి 3 పరుగులు చేసి స్టంప్ అవుట్గా వెనుదిరిగాడు. దీంతో సూపర్ ఓవర్ ఖాయం అనుకున్న దశలో ఇన్నింగ్స్ చివరి బంతికి టినో బెస్ట్ సింగిల్ తీసి వెస్టిండీస్ లెజెండ్స్ను సెమీస్కు చేర్చాడు. ఈరోజు జరగనున్న సెమీస్లో ఇండియా లెజెండ్స్ను వెస్టిండీస్ ఎదుర్కోనుంది. మరో సెమీస్ శ్రీలంక లెజెండ్స్, దక్షిణాఫ్రికా లెజెండ్స్ మధ్య జరగనుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది.
మరోవైపు భారత మాజీ క్రికెటర్ల మధ్య తాజాగా కేక్ ఫైట్ జరిగింది. భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాను ఇండియా లెజెండ్స్ జట్టు సభ్యులు పట్టుకోగా.. యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యుసుఫ్ పఠాన్లు ఓజా ముఖంపై కేక్ పూశారు. యుసుఫ్ అయితే ఓజా ముఖం, జుట్టును కేక్తో నింపేసాడు. ఆ వెంటనే కేక్ పూయడానికి ఓజా ప్రయత్నించగా.. ఇర్ఫాన్ పరుగెత్తుకుని తప్పించుకున్నాడు. ఇంతలో ప్రజ్ఞాన్ ఓజా యువరాజ్ సింగ్కు కేక్ పూయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మహ్మద్ కైఫ్ యూవీని పట్టుకోగా.. ఓజా అతని ముఖంపై కేక్ పూసి ప్రతీకారం తీర్చుకున్నాడు. యువీ మొదట కాస్త ప్రతిఘటించినా.. కైఫ్ పట్టుకోవడంతో కైఫ్ పని సులువైంది.