అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి క్వాలిఫయిర్-2కు అర్హత సాధించింది. ఫైనల్ బెర్త్ కోసం చెపాక్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో శుక్రవారం పోటీ పడనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 172 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (34; 22 బంతుల్లో, 2x4, 2x6), విరాట్ కోహ్లి (33; 24 బంతుల్లో, 3x4, 1x6), మహిపాల్ లోమ్రర్ (32; 17 బంతుల్లో, 2x4, 2x6) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ (3/44) మూడు, అశ్విన్ (2/19) రెండు వికెట్లు తీశారు.

అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వీ జైస్వాల్ (45; 30 బంతుల్లో, 8x4), రియాన్ పరాగ్ (36; 26 బంతుల్లో, 2x4, 2x6), హెట్మెయిర్ (26; 14 బంతుల్లో, 3x4, 1x6) విజయంలో కీలక పాత్ర పోషించారు. సిరాజ్ (2/33) రెండు వికెట్లు తీశాడు. అయితే ఈ క్రమంలో రియాన్ పరాగ్ అరుదైన రికార్డు సాధించాడు.
ఈ సీజన్లో రియాన్ నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. 13 ఇన్నింగ్స్ల్లో 56 సగటుతో 567 పరుగులు చేశాడు. ఇందులో హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ఓ ఐపీఎల్ సీజన్లో నాలుగు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా రియాన్ పరాగ్ చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో రిషభ్ పంత్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2018 సీజన్లో పంత్ 579 పరుగులు తీశాడు.
ఈ జాబితాలో పంత్, పరాగ్ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (538 రన్స్, 2013), గ్లెన్ మాక్స్వెల్ (513 రన్స్, 2021), దినేశ్ కార్తీక్ (498 రన్స్, 2018) ఉన్నారు. కాగా, ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ మరో రెండు మ్యాచ్లు ఆడే అవకాశం ఉండటంతో పంత్ రికార్డును పరాగ్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.