Rajasthan Royals Playoffs: బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించడం వల్ల.. తాజాగా జరిగిన ఐపీఎల్ 2025లోని మ్యాచులో ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ను దారుణంగా ఓడించింది. ఏకంగా 100 పరుగులు తేడాతో పరాజయాన్ని అందుకుంది. పేలవ ప్రదర్శనతో ఈ సీజన్ లో ఎనిమిదో ఓటమిని అందుకున్న రాజస్థాన్ జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. వాస్తవానికి ఈ మ్యాచ్కు ముందు వరకు సాంకేతికంగానైనా ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ఆ జట్టు.. ఇప్పుడీ ఓటమితో అధికారికంగా పోటీ నుంచి వైదొలిగింది.
ఈ మ్యాచులో 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ తేలిపోయింది. బౌల్ట్ (3/28), కర్ణ్ శర్మ (3/23), బుమ్రా (2/15) దెబ్బకు 117 పరుగులకే చాప చుట్టేసింది. ఆర్చర్ (30) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. గత మ్యాచ్లో వీర విధ్వంసం సృష్టించిన వైభవ్, జైశ్వాల్.. ఈ మ్యాచులో చేతులెత్తేశారు. పరాగ్ (16), హెట్మేయర్ (0), నితీశ్ రానా(9), శుభమ్ దూబె (15) అందరూ విఫలమయ్యారు. దీంతో రాజస్థాన్ కు ఓటమి తప్పలేదు.

మ్యాచ్ అనంతరం ఓటమి గురించి స్పందించాడు రియాన్ పరాగ్. "ముంబై ఇండియన్స్ అద్భుతంగా ఆడింది. వాళ్లకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. వాళ్ల బ్యాటింగ్ చేసిన విధానం బాగుంది. మ్యాచ్ను కాస్త డెప్త్ కు తీసుకెళ్లారు. ఓవర్కు 10 పరుగులు స్థిరంగా చేసి, ఆఖర్ లో దూకుడు పెంచారు. మా బ్యాటింగ్ అనుకున్నంత స్థాయిలో లేదు. ఇది మా రోజు కాదు. 190-200 టార్గెట్ అయితే బాగుండేది. కానీ చివర్లో హార్దిక్, సూర్య భాయ్ అద్భుతంగా ఆడారు. మేము కొన్ని అంశాల్లో మెరుగవ్వాలి. మేము మంచి ఆరంభాలను ఇస్తున్నాం, కానీ మిడిల్ ఆర్డర్ లో సమస్య ఉంది. పవర్ప్లేలో వికెట్లు కోల్పోతే నేను, ధ్రువ్ నిలబడాలి. అయినా మేము మా మీద నమ్మకంతోనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితి మళ్లీ వస్తే, ఎలా ఎదుర్కోవాలో సిద్ధంగా ఉన్నాం."
"మొత్తంగా ఈ సీజన్ లో మేము చాలా అంశాల్లో బానే రాణించాం. అలానే కొన్ని తప్పులు కూడా చేశాం. మేము బాగా రాణించిన విషయాలపై బాగా దృష్టి పెట్టాలి. చిన్న చిన్న తప్పులు ఎక్కువగా చేశాం. వాటిని పునరావృతం చేయకుండా సరిచేసుకోవాలి. కొన్ని మ్యాచుల్లో చాలా దగ్గరగా వచ్చి ఓడిపోయాం. నెక్ట్స్ జరగబోయే మూడు మ్యాచుల్లో బాగా రాణిస్తామని ఆశిస్తున్నాను." అని రియాన్ పరాగ్ పేర్కొన్నాడు.