తొలి ఇన్నింగ్స్ ముగిశాక
ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత హర్షల్ పటేల్ వర్సెస్ రియాన్ పరాగ్ మధ్య గొడవ జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటర్లు విఫలమైన తరుణంలో పరాగ్ చక్కటి హాఫ్ సెంచరీ చేసి ఇన్నింగ్స్ నిలబెట్టాడు. 56పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇక అతను ఇన్నింగ్స్ చివరి ఓవర్లో హర్షల్ పటేల్ను ఎదుర్కొన్నాడు. ఆ ఓవర్లో 18పరుగులు పిండుకున్నాడు. తద్వారా జట్టు స్కోరు 140పరుగుల మార్కు దాటింది. తొలి ఇన్నింగ్స్ ముగిశాక.. పరాగ్ పెవిలియన్ వైపు వెళ్తుండగా.. హర్షల్ పటేల్, పరాగ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక సిరాజ్ సైతం హర్షల్కు జత కలిశాడు. ఇంతలో ఆర్ఆర్ సపోర్ట్ స్టాఫ్ పర్సన్ ఒకరు వచ్చి ఈ గొడవను సద్దుమణిగించి.. పరాగ్ను తీసుకెళ్లాడు.
గతంలో నాకు వేలు చూపించాడు.. నేను ఇప్పుడు చూపించా
ఈ విషయమై రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. 'గతేడాది ఐపీఎల్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో హర్షల్ పటేల్ నన్ను అవుట్ చేశాడు. నేను పెవిలియన్ వైపు వెళ్తుంటే.. నన్ను వెళ్ళిపో పో.. అనేలా చేతితో సైగ చేశాడు. నేను వెళ్తున్నప్పుడు ఆ సైగను చూడలేదు. డగౌట్లో రీప్లే చూసినప్పుడు హర్షల్ పటేల్ నన్ను వెకిలిగా వెళ్లిపోమన్నట్లు సైగ చేశాడని గమనించాను. అది నా మనసులో అలా ఉండిపోయింది. ఇక ఈ ఐపీఎల్లో నేను అతని బౌలింగ్లో ధాటిగా ఆడాను. అప్పుడు అతనెలా చేశాడో నేను ఇప్పుడు అదే సైగ చేశాను. నేను అతన్నీ ఏమీ అనలేదు. ఒక్క తిట్టు కూడా తిట్టలేదు.' అని చెప్పాడు.
నన్ను చిన్నపిల్లాడు అన్నారు
ఇక నేను సైగ చేయడం చూసి మహమ్మద్ సిరాజ్ నన్ను పిలిచి.. "ఏయ్, ఇక్కడికి రా, ఇక్కడికి రా.. నువ్వు చిన్నపిల్లాడివి , చిన్నపిల్లాడిలా ప్రవర్తించు" అన్నాడు. నేను సిరాజ్తో 'భయ్యా, నేను మిమ్మల్ని ఏమీ అనలేదు' అని చెప్పాను. అప్పటికి హర్షల్ పటేల్, సిరాజ్ ఇద్దరు కలిసి నా మీదకు వచ్చారు. ఇక కాస్త వాదన జరిగింది. అప్పటికే మా సపోర్ట్ స్టాఫ్ ఒకరు వచ్చి నన్ను తీసుకెళ్లారు. మ్యాచ్ ముగిశాక నేను ఇదంతా మర్చిపోయి హర్షల్కు షేక్ హ్యాండ్ ఇవ్వబోతే అతను పట్టించుకోలేదు. అతనికి మెచురిటీ లేదనిపించింది.' అని పేర్కొన్నాడు. ఇకపోతే ఈ సీజన్లో రియాన్ పరాగ్.. రాజస్థాన్ రాయల్స్ తరఫున 14ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీతో సహా 183పరుగులు చేశాడు.