హైదరాబాద్: ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా బాలీవుడ్ నటుడు రిషి కపూర్ భారత మహిళా క్రికెటర్లను టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో పోలుస్తూ చేసిన ట్వీటు దుమారం రేపింది. లార్డ్స్ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ 9 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
2002లో నాట్వెస్ట్ కప్ ఫైనల్స్లో ఇదే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లాండ్ను భారత్ చిత్తుగా ఓడించింది. మ్యాచ్ అనంతరం అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ చొక్కా విప్పేసి గంతులేశాడు. ఇప్పుడు రిషి కపూర్ ఆ సంఘటనను గుర్తుచేస్తూ ఆదివారం మధ్యాహ్నాం మ్యాచ్ మొదలవడానికి ముందు ట్విట్టర్లో ఓ ట్వీట్ని పోస్టు చేశాడు.

అందులో 'అప్పుడు గంగూలీ చిందులు వేసినట్టే ఇప్పుడూ జరగాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశారు.
రిషి కపూర్ ట్వీట్పై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. గంగూలీ చొక్కా విప్పి చేసిన విన్యాసాలను మహిళా జట్టు క్రికెటర్లు మ్యాచ్లో ఎలా చేస్తారంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో నెటిజన్ల ఆగ్రహానికి గురైన రిషి కపూర్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చాడు.
'నేను తప్పుగా ఏం చెప్పాను? మహిళా క్రికెటర్ గంగూలీలా చేయాలని అనలేదు. గంగూలీ ఇలా మళ్లీ చేయాలని అన్నాను. మీ ఆలోచనా విధానంలో లోపం ఉంది' అని ట్వీట్ చేశాడు.