శిఖర్ పవర్ ప్లేలో బాగా ఆడాడు:
'సొంత పిచ్లు కాకుండా బయటి పిచ్లు కూడా మాకు కలిసొస్తున్నాయి. ఇది ఆనందించదగిన విషయం. ఈ పిచ్ మా బ్యాట్స్మెన్కు సరిగ్గా సరిపోతుంది. మా బ్యాట్స్మెన్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. శిఖర్ ధావన్ పవర్ ప్లేలో బాగా బ్యాటింగ్ చేసాడు. పిచ్ ఎలా స్పందిస్తుందో మా ఆటగాళ్లు బాగా అర్థం చేసుకున్నారు. అందుకే మా బ్యాట్స్మెన్ అన్ని పిచ్లపైనా రాణిస్తున్నారు' అని శ్రేయస్ అయ్యర్ తెలిపారు.
పంత్ ఆ బాధ్యత తీసుకున్నాడు:
'రాజస్థాన్ ఆరంభం చూసి 200లకు పైగా స్కోర్ చేస్తారనుకున్నాం. కానీ మా బౌలర్లు వారిని నియంత్రించారు. అక్కడే మేము సఫలం అయ్యాం. అంజిక్య రహానే అద్భుతంగా ఆడాడు. ఇన్నింగ్స్ ప్రారంభించే వాళ్లకే బ్యాటింగ్ చేసేందుకు ఎక్కువ సమయం ఉంటుందని కోచ్ రికీ పాంటింగ్ చెప్పారు. పాంటింగ్ చెప్పినట్లే గత రెండు మ్యాచుల్లోనూ మ్యాచ్ ముగిసే వరకూ క్రీజులో ఉన్నాను. ఈ మ్యాచ్లో పంత్ ఆ బాధ్యత తీసుకున్నాడు' అని శ్రేయస్ చెప్పుకొచ్చారు.
పంత్ మెరుపు ఇన్నింగ్స్:
మొదటగా బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. రహానే (105 నాటౌట్; 63 బంతుల్లో 11ఫోర్లు, 3 సిక్సర్లు), స్మిత్ (50; 32 బంతుల్లో 8ఫోర్లు)లు రాణించారు. అనంతరం 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పంత్ (78 నాటౌట్; 36 బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ధావన్ (27 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ చేసాడు.