ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్ను నిర్వహించనున్నారు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రారంభం కానుంది. విదేశాల్లో ఐపీఎల్ వేలాన్ని నిర్వహించడం వరుసగా ఇది రెండోసారి. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మందినే షార్ట్ లిస్ట్ చేసింది.
వాళ్లలో మొత్తంగా 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇందులో 70 మంది విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్లలో 366 మంది భారత ఆటగాళ్లు, 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అయితే ఆటగాళ్లందరిలో రిషభ్ పంత్కు భారీ డిమాండ్ దక్కనుందని టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అన్నాడు. కనీసం రూ.25 కోట్లు నుంచి రూ.30 కోట్లు వరకు పంత్పై బిడ్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాడు. గతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎక్కువ ధర పొందడం చూశామని, కానీ ఈ సారి మనోళ్లు ఆల్టైమ్ రికార్డు ధర పలుకుతారని రైనా జోస్యం చెప్పాడు.

రిషభ్ పంత్తో మాత్రమే కాకుండా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లకు కూడా వేలంలో భారీ డిమాండ్ దక్కే అవకాశం ఉందని రైనా చెప్పాడు. పంత్ గన్ ప్లేయర్ అని, గన్ వికెట్ కీపర్ అని కొనియాడాడు. పంత్ ఎక్కడున్నా కప్ను సాధించే స్వభావంతో ముందుకు వెళ్తాడని అన్నాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా అదే స్వభావంతో శ్రమిస్తారని చెప్పాడు. అయితే కొన్ని జట్లు ఈసారి ప్లేయర్ల కోసమే కాదని, కెప్టెన్ల కోసం రూ.కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాయని రైనా అన్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ వంటి ఫ్రాంచైజీలు భారత కెప్టెన్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తాయని రైనా తెలిపాడు. పంజాబ్ వద్ద అందరి కంటే రూ.110.50 కోట్లు ఉన్నాయని, అలాగే ఢిల్లీ తమ వద్ద ఉన్న రూ.73 కోట్లతో పాటు ఆర్టీఎమ్తో తిరిగి పంత్ను దక్కించుకునే ఛాన్స్ ఉందని అన్నాడు. అలాగే ఆర్సీబీ తమ వద్ద ఉన్న రూ.83 కోట్లతో కెప్టెన్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తుందని రైనా చెప్పాడు.
2016లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేసిన పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా 2023 సీజన్ మినహా.. మిగిలిన అన్ని సీజన్లలో ఢిల్లీకే ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో 35.31 సగటుతో, 148.93 స్ట్రైక్రేటుతో 3284 పరుగులు చేశాడు.