
హైదరాబాద్: ఐపీఎల్ జరగడానికి ముందు భారత్ ఆడిన నిదహాస్ ట్రోఫీలో ఆఖరి 2 ఓవర్లపై విజయం ఆధారపడి ఉంది. ఆ సమయంలో క్రీజులో ఉన్న విజయ్ శంకర్ 4బంతులను వృథా చేశాడు. అప్పటికీ భారత్కు 34పరుగులు కావాల్సి ఉంది. దీంతో విజయ్ శంకర్పై క్రికెట్ అభిమానులంతా దుమ్మెత్తిపోశారు. విజయ్ శంకర్ వెనుదిరగడంతో రంగంలోకి దిగిన దినేశ్ కార్తీక్ 8 బంతుల్లోనే 29 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు.
ఆ వైఫల్యానికి విజయ్ శంకర్ను నెటిజన్లతో పాటుగా అందరూ విమర్శించారు. ఢిల్లీ డేర్డెవిల్స్కు ప్రాతినిధ్యం వహిస్తోన్న విజయ్ శంకర్ పూణె వేదికగా జరిగిన మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి చెన్నైను వణికించాడు. చెన్నైపై నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ ఆడి ఒకానొక దశలో ధోనీని సైతం గాబరా పెట్టించాడు. రిషబ్ పంత్ 45 బంతుల్లో (79) అవుటయ్యేంత వరకు నెమ్మదిగా ఆడిన ఈ తమిళనాడు క్రికెటర్.. తర్వాత జూలు విదిల్చాడు.
డ్వేన్ బ్రావో వేసిన 19వ ఓవర్లో హ్యట్రిక్ సిక్స్లతో చెన్నైని వణికించాడు. పంత్ అవుటయ్యాక మ్యాచ్పై ఆశలు వదిలేసుకున్న ఢిల్లీ ఫ్యాన్స్కి.. విజయ్ ఆట చూశాక ప్రాణం లేచొచ్చింది. ఆఖరి ఓవర్లో విజయానికి 28 పరుగులు అవసరం కాగా.. తాను ఎదుర్కొన్న తొలి బంతిని సిక్స్గా మలిచిన విజయ్.. తర్వాత అదే ఊపు కొనసాగించ లేకపోయాడు. దీంతో చెన్నై 13 రన్స్ తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. మ్యాచ్ ఓడినా ఆఖర్లో అద్భుత హిట్టింగ్తో తమిళుడైన విజయ్ చెన్నై సూపర్ కింగ్స్ను భయపెట్టాడు.
ఇంతకుముందు మ్యాచ్లో విజయాన్ని నమోదు చేసుకున్నప్పటికీ, ఇది ఢిల్లీకి ఆరో పరాజయం. అదే కారణంతో అన్ని ఫ్రాంచైజీల కంటే ఆఖరి నుంచి మొదటి స్థానంలో ఉండిపోయింది. ఢిల్లీపై గెలిచి చెన్నై మరోసారి లీగ్ జాబితాలో టాప్కు చేరిపోయింది.