రిషభ్ పంత్ తన కారు ప్రమాదం తర్వాత క్రికెట్ మైదానంలోకి అద్భుతంగా అడుగుపెట్టినప్పటికీ.. వన్డే ఫార్మాట్లో మాత్రం అతనికి కాలం కలిసి రావడం లేదు. గత 18 నెలలుగా జట్టులో ఉన్నా తుది జట్టులో అవకాశం దక్కకపోవడంతో సెలెక్టర్లు ఇప్పుడు రిషభ్ పంత్ను వన్డే జట్టు నుంచి తప్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం. 2024లో పునరాగమనం చేసినప్పటి నుంచి రిషభ్ పంత్ కేవలం ఒకే ఒక వన్డే(శ్రీలంకపై) ఆడాడు. 2025 మొత్తం రిజర్వ్ బెంచ్కే పరిమితమైన రిషభ్ పంత్ను పక్కన పెట్టి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొత్త కీపర్ను సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది.
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే రిషభ్ పంత్ కేవలం ఒక్క ఫార్మాట్(టెస్ట్) ఆటగాడిగానే మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే రిషభ్ పంత్ టీ20 జట్టులో చోటు కోల్పోగా.. ఇప్పుడు వన్డే జట్టు నుంచి కూడా ఉద్వాసన తప్పేలా లేదు. కెరీర్లో ఇప్పటివరకు 31 వన్డేలు ఆడిన రిషభ్ పంత్ 33.50 సగటుతో 871 పరుగులు చేశాడు. టెస్టుల్లో అదరగొడుతున్నా పరిమిత ఓవర్ల క్రికెట్లో నిలకడలేమి పంత్కు ప్రతిబంధకంగా మారింది. దీంతో సెలెక్టర్లు సంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి యువ రక్తాన్ని ప్రోత్సహించాలని చూస్తున్నారు.

రిషభ్ పంత్ స్థానాన్ని భర్తీ చేసే రేసులో జార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ అందరికంటే ముందున్నాడు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఇషాన్ కిషన్ వన్డే జట్టులోకి ఘనంగా రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. 2023 ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్.. మధ్యలో సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అయితే ఇటీవల దేశవాళీ క్రికెట్లో అతను ప్రదర్శిస్తున్న ఫామ్ సెలెక్టర్లను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ను విజేతగా నిలబెట్టడం ఇషాన్ కిషన్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.
ఇషాన్ కిషన్ ఫామ్కు నిదర్శనం ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో బాదిన మెరుపు సెంచరీ. కర్ణాటక వంటి బలమైన జట్టుపై కేవలం 33 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకొని చరిత్ర సృష్టించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం వన్డేల్లో ఫినిషర్ పాత్రకు అతను సరిపోతాడనే సంకేతాలను పంపింది. లోయర్ ఆర్డర్లో వేగంగా పరుగులు రాబట్టగల కీపర్ కోసం వెతుకుతున్న టీమిండియాకు ఇషాన్ కిషన్ ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు.
న్యూజిలాండ్తో త్వరలో జరగనున్న స్వదేశీ వన్డే సిరీస్ భారత్కు అత్యంత కీలకం. శుభ్మన్ గిల్ సారథ్యంలో బరిలోకి దిగనున్న ఈ జట్టులో వికెట్ కీపర్ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. కేఎల్ రాహుల్ ప్రధాన కీపర్గా ఉన్నప్పటికీ.. బ్యాకప్ స్థానం కోసం ఇషాన్ కిషన్తో పాటు సంజూ శాంసన్, ధ్రువ్ జురేల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇషాన్ కిషన్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంత్ వంటి కీలక ఆటగాడిని తప్పించడం సాహసోపేతమైన నిర్ణయమే అయినప్పటికీ, జట్టు ప్రయోజనాల దృష్ట్యా సెలెక్టర్లు ఏ వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.