
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్కు ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలోనే అతని మొఖం, మోకాళ్లు తదితర భాగాలకు గాయాలయ్యాయి. దీంతో అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వచ్చిందని డెహ్రాడూన్లో పంత్కు చికిత్స చేస్తున్న ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ గాయాల వల్ల వచ్చే ఏడాదిలో టీమిండియాకు కీలకమైన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్కు పంత్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఐపీఎల్ కూడా పంత్ ఆడే అవకాశం కనిపించడం లేదు.
కొత్త సంవత్సరం వస్తున్న నేపథ్యంలో తల్లికి సర్ప్రైజ్ ఇద్దామని పంత్ వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఢిల్లీ నుంచి రూర్కీకి వేగంగా వెళ్తుండగా పంత్కు బాగా నిద్ర వచ్చింది. ఆ మత్తులో తూలడంతో అతని కారు డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ సమయంలో కిటికీ అద్దం పగలడంతో దానిలో నుంచి బయట పడేందుకు పంత్ ప్రయత్నించాడు.
ఆలోపే వాహనానికి మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక హరియాణా బస్సులో డ్రైవర్ సుశీల్ కుమార్.. తన బస్సును రోడ్డు పక్కన ఆపేసి కిందకు పరిగెత్తుకొచ్చాడు. కారు కిటికీలో నుంచి సగం బయటకు వచ్చిన పంత్ను పూర్తిగా బయటకు లాగి, ఒక బెడ్షీట్తో అతన్ని కప్పాడు. వెంటనే అంబులెన్సుకు సమాచారం అందించాడు.
ప్రస్తుతానికైతే పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అతను స్పృహలో ఉన్నాడని మ్యాక్స్ హాస్పిటల్ వైద్యులు చెప్పారు. అయితే పంత్ కుడి చేయి, కాలుకు తీవ్రమైన గాయాలయ్యాయి. అలాగే నుదుటిపై, కంటికి సమీపంలో కూడా దెబ్బలు తగిలాయి. వీటి నుంచి పంత్ కోలుకోవడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని, లేదంటే ఆరు నెలలు కూడా పట్టే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. పూర్తి మెడికల్ రిపోర్టు వచ్చిన తర్వాతనే దీన్ని సరిగా అంచనా వేయగలమని, అయితే మూడు నెలలపాటు మాత్రం పంత్ మళ్లీ మైదానంలో దిగలేడని స్పష్టం చేశారు. ఈ లెక్కన వచ్చే ఏడాది ఐపీఎల్, ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్కు పంత్ దూరమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.