కూర్పు విషయంలో కుస్తీ!
టీమిండియాలో సెటిల్డ్ ఓపెనర్ శిఖర్ ధావన్. రోహిత్ శర్మతో శిఖర్ ధావన్ టీమిండియా ఇన్నింగ్ ఆరంభిస్తూ వచ్చాడు. మొన్నటి ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా శిఖర్ ధావన్ తన ఎడమచేతి వేలికి దెబ్బ తగిలించుకోవడం, టోర్నమెంట్ మొత్తానికీ దూరం కావడం, అతని స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ను జట్టులోకి తీసుకోవడం వెంటవెంటనే చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో- జట్టు కూర్పు విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ కుస్తీ పడుతోంది.
ఓపెనర్గా ఎవరొస్తారు?
మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా నంబర్ ఫోర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ను ఓపెనర్గా పంపించి, ఓ ప్రయోగం చేసింది టీమ్ మేనేజ్మెంట్. రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్ను ఆరంభించిన ఈ కన్నడిగుడు.. ఎలా రాణించాడో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రోహిత్ కలిసి, స్ట్రైక్ను రొటేట్ చేస్తూ జట్టు భారీ స్కోరు చేయడానికి సహకరించాడు. తానూ అర్ధసెంచరీని నమోదు చేశాడు. కుదురుగా ఆడాడు. పొరపాట్లకు అవకాశం లేని ఇన్నింగ్ను ఆడాడు రాహుల్. ఈ పరిస్థితుల్లో అతణ్ని పక్కన పెట్టే సాహసం చేయకపోవచ్చు టీమ్ మేనేజ్మెంట్. అలా చేయడం వల్ల రాహుల్ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతిన్నట్టవుతుందని అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ ఓపెనర్గా వెళ్లడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నంబర్ ఫోన్ ఎవరు?
నిజానికి ఈ స్థానం కేఎల్ రాహుల్ది. శిఖర్ ధావన్ గాయపడటం వల్ల పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రాహుల్ను ఓపెనర్గా పంపించి, నాలుగో స్థానంలో ఆడటానికి ఆల్రౌండర్ విజయ్ శంకర్ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్లో విజయ్ శంకర్ రెండు వికెట్లను తీసుకుని బౌలర్గా కూడా రాణించాడు. ప్రపంచకప్లో తొలి బంతికే వికెట్ను పడగొట్టిన క్రికెటర్గా నిలిచిపోయాడు. విజయ్ శంకర్ ఆల్ రౌండర్. అటు బ్యాట్తో ఇటు బంతితో మెరుపులు మెరిపించగలడు. ఇలాంటప్పుడు విజయ్ శంకర్ను పక్కన పెట్టడం కూడా కుదరని పని అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుతం విజయ్ శంకర్ గాయపడ్డాడు. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా జస్ప్రీత్ బూమ్రా వేసిన బంతి అతని పాదాలను బలంగా తాకింది. దీనితో నెట్ ప్రాక్టీస్ నుంచి అర్ధాంతరంగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతను కోలుకున్నాడంటూ బూమ్రానే స్వయంగా వెల్లడించిన నేపథ్యంలో జట్టు కూర్పు విషయం మళ్లీ మొదటికి వచ్చినట్టయింది.
రిషబ్ పంత్కు అవకాశాలు లేవా?
ఆఫ్ఘనిస్తాన్తో ఆడే మ్యాచ్ సందర్భంగా రిషబ్ పంత్ను తుది జట్టులోకి తీసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం.. ఆడుతున్నది ఆఫ్ఘనిస్తాన్తో కావడం. ఆఫ్ఘనిస్తాన్ పెద్దగా ప్రమాదకర జట్టు కాకపోవడం వల్ల రిషబ్ పంత్ను తుది జట్టులోకి తీసుకుని టీమ్ మేనేజ్మెంట్ ఓ చిన్నపాటి ప్రయోగం చేయడానికి అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ప్రపంచకప్లో రిషబ్ పంత్ ఏ స్థాయిలో రాణించగలడో.. ఈ మ్యాచ్ ద్వారా తేలిపోతుందని, దీనివల్ల మిగిలిన మ్యాచ్లకు సరైన ప్రత్యామ్నాయంగా ఉంటాడనే టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.