Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. మొదట బంగ్లాదేశ్ను, ఆ తర్వాత పాకిస్థాన్ ను ఓడించి భారత జట్టు సెమీ ఫైనల్స్ కు అర్హత సాధించింది. అంతకు ముందు ఇంగ్లాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్లో భారత జట్టు ఒక్క మ్యాచ్ లోనూ ఓడిపోలేదు. అన్ని మ్యాచ్ లలో విజయాలు వరిస్తుండగా.. కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో ఎటువంటి మార్పులు చేయడం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే మ్యాచ్లలో కూడా ప్లేయింగ్ 11లో మార్పు ఉండదని తెలుస్తోంది.
ఆ ఆటగాళ్లు బెంచ్కే పరిమితమా?
ఆ నేపథ్యంలో టీమిండియాలో కొంత మంది ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీలో బెంచ్ కే పరిమితమయ్యారు. వారిలో స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. గతంలో అనేక మ్యాచ్ లలో వన్డే క్రికెట్ లో భాగస్వామ్యమైన రిషబ్ పంత్.. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. జట్టులో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, బ్యాటర్ గా ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే కోచ్ గౌతమ్ గంభీర్ స్వయంగా కేఎల్ రాహుల్ జట్టులో ఆడటం ఖాయమని స్పష్టం చేశారు.

కోచ్ గౌతమ్ గంభీర్ ఏమన్నాడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. కేఎల్ రాహల్ ప్రస్తుతం మన నంబర్ వన్ వికెట్ కీపర్ అని.. తాను ఇప్పుడు చెప్పగలిగేది అదేనని వెల్లడించాడు. రిషబ్ పంత్ కు అవకాశం లభిస్తుంది కానీ ప్రస్తుతం రాహుల్ బాగా రాణిస్తున్నాడని.. ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్సెమెన్ తో మనం ఆడలేమని గంభీర్ ప్రకటించారు. ఈ ప్రకటనను బట్టి రిషబ్ పంత్ కు ప్రస్తుతం ప్లేయింగ్ 11లో అవకాశం రావడం చాలా కష్టమని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో రిషబ్ పంత్ బెంచ్ కే పరిమితం కావచ్చు.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు..
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు రిషబ్ పంత్. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. కేఎల్ రాహుల్ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 47 బంతుల్లో 41 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ కు పాకిస్థాన్ పై బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.