టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. పంత్ సోదరి సాక్షి నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. గత తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్నఅంకిత్ చౌదరీతో సాక్షి పెళ్లి పీటలక్కెనుంది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి.
తమ తొమ్మిదేళ్ల లవ్ స్టోరీలో మరో కొత్త ఛాప్టర్ మొదలైందని సాక్షి తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. సాక్షి, అంకిత్ లండన్లో నివసిస్తున్నారు. అమిటీ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన అంకిత్ లండన్కి వెళ్లి స్థిరపడ్డాడు. మరోవైపు పంత్ కూడా ఎంగేజ్మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. సోదరికి శుభాకాంక్షలు తెలిపాడు.

కాగా, రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషభ్ పంత్ దాదాపు ఏడాది నుంచి క్రికెట్కు దూరమయ్యాడు. సర్జరీ చేయించుకున్న అనంతరం నడవడానికే కష్టపడిన పంత్ కోలుకుని పరుగులు పెడుతున్నాడు. మరికొన్ని రోజుల్లో పూర్తి ఫిటెనెస్ సాధించేలా పంత్ కసరత్తులు చేస్తున్నాడు.
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో తిరిగి టీమిండియాలో చోటు సంపాదించేలా ప్రణాళికలు రచిస్తున్నాడు. అయితే జట్టులో తిరిగి స్థానం పొందాలంటే పంత్ ఐపీఎల్ లో తప్పక సత్తాచాటాలి. మరోవైపు పంత్ పై దిల్లీ క్యాపిటల్స్ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో పంత్ వేలంలో కూడా పాల్గొనడం విశేషం. వేలానికి వచ్చిన తొలి కెప్టెన్గా పంత్ రికార్డులకెక్కాడు.

వేలం కోసం దుబాయ్కు వెళ్లిన పంత్ అనంతరం దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీతో కలిసి కొన్నిరోజులు గడిపాడు. న్యూయర్ వేడుకులు కూడా ధోనీతోనే కలిసి జరుపుకున్నాడు. కాగా, మార్చి ఆఖర్లో ఐపీఎల్ వచ్చే సీజన్ ప్రారంభం కానుంది. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షెడ్యూల్ను ఇంకా ఖరారు చేయలేదు. అయితే ఐపీఎల్ ముగిసిన అనంతరమే టీ20 ప్రపంచకప్ జరగనుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా వరల్డ్ కప్నకు ఆతిథ్యం ఇస్తుంది.