
కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా అతను ఆటకు దూరమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్ 2023లో కూడా అతను ఆడటం లేదు. ఈ ఏడాది ఐపీఎల్లో అతను ఆడటం లేదనే విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. వన్డే వరల్డ్ కప్ నాటికి జట్టులో చేరతాడో? లేదో కూడా తెలియని పరిస్థితి. ఈ క్రమంలో నెమ్మదిగా కోలుకుంటున్న పంత్.. తాజాగా తన రికవరీ సెషన్కు సంబంధించిన వీడియో షేర్ చేశాడు.
గతేడాది చివర్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇంటికి వెళ్తున్న సమయంలో పంత్ కారుకు యాక్సిడెంట్ అయింది. ముఖ్యంగా అతని కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో అతనికి పలు శస్త్రచికిత్సలు చేశారు. అనంతరం అక్కడే నెమ్మదిగా కోలుకుంటున్నాడీ స్టార్ క్రికెటర్. ఈ క్రమంలోనే తన రికవరీ సెషన్లో భాగంగా స్విమ్మింగ్ పూల్లో నిలబడి, సరిగా నడిచేందుకు పంత్ ప్రయత్నిస్తూ కనిపించాడు. చేతిలో కర్రతో అతను ఒక్కో అడుగే ముందుకేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఇలా గాయపడిన తర్వాత కూడా తిరిగి మైదానంలో దిగేందుకు పట్టుదలగా ప్రయత్నిస్తున్న పంత్ను అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. పంత్ షేర్ చేసిన వీడియో చూసిన అభిమానులు అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా పంత్ లేకపోవడంతో బోర్ కొట్టేసిందని, అతను త్వరగా కోలుకొని జట్టులో చేరితే బాగుంటుందని ఆశించారు. కొన్నిరోజుల క్రితం ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి కూర్చొన్న పంత్.. 'ప్రశాంతంగా కూల్చొని ఊపిరి పీల్చుకోవడం ఇంత గొప్పగా ఉంటుందని నాకు తెలీదు' అంటూ ఎమోషనల్ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే.