ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రస్తుతం టీమిండియా వన్డే సిరీస్ ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ బరిలో దిగింది. అయితే ఈ సిరీస్ లోని తొలి రెండు వన్డేలకు వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ను తీసుకుంది మేనేజ్మెంట్. రిషభ్ పంత్ను బెంచ్కే పరిమితం చేసింది. దీంతో పంత్.. మ్యాచ్ జరగే సమయంలో డగౌట్ లో ఎమోషనల్ అవుతూ కనిపించాడు!. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రెండు మ్యాచుల్లోనూ విఫలమైన రాహుల్..
కేఎల్ రాహుల్ కు వన్డే స్పెషలిస్ట్గా ప్రత్యేక పేరు ఉంది. వికెట్ల వెనక చురుగ్గా క్యాచులు పట్టుకోవడం, రనౌట్లు, స్టంపింగ్స్ చేయడం.. ఇన్నింగ్స్ను నిలబెట్టే బ్యాటర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు స్థానాలు మారుస్తూ అతడిపై ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతోన్న వన్డే సిరీస్ కోసం పంత్ ను పక్కనపెట్టి అతడిని ఎంపిక చేశారు. కానీ అతడు తొలి రెండు మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు.

మొత్తం 12 పరుగులు..
నాగ్పూర్ మ్యాచ్ లో కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. కటక్లో జరిగిన రెండో వన్డేలో 14 బంతులు ఎదుర్కొన్న అతడు.. 10 పరుగులే చేశాడు. మొత్తంగా 12 పరుగులు మాత్రమే చేశాడు. అయితే రెండో వన్డే మ్యాచ్ జరిగేటప్పుడు డగౌట్ లో కూర్చొన్న పంత్ కాస్త డల్ గా నిరుత్సాహంగా కనిపించాడు. కాస్త ఎమోషనల్ గానూ అనిపించాడు. మాజీ క్రికెటర్, కామెంటేటర్ రవిశాస్త్రి కూడా గురించి పంత్ గురించి స్పందిస్తూ జట్టు కూర్పు గురించి తాను ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాడు.
ఏదేమైనా వన్డేల్లో మంచి డీసెంట్ రికార్డు ఉన్న పంత్.. ఈ సిరీస్ కు ఎంపికకాకపోవడంపై అలా నిరాశగా కూర్చున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు. మరోవైపు కేఎల్ రాహుల్ విఫలమవ్వడంతో అతడిని ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.