India vs Australia: కోపం వచ్చింది.. హిట్టింగ్కు దిగా!! సెంచరీ చేశా: పంత్

సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా 'ఎ' జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. చివరి రోజూ పిచ్ బ్యాటింగ్కు అనుకూలించింది. జాక్ విల్డర్మత్ (119 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 111) నాటౌట్), బెన్ మెక్డెర్మాట్ (167 బంతుల్లో 16 ఫోర్లతో 107 నాటౌట్) అజేయ శతకాలతో చెలరేగారు. ఫలితంగా ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఎ 75 ఓవర్లలో 4 వికెట్లకు 307 పరుగులు చేసింది. మొహ్మద్ షమీ 2, హనుమ విహారి, మొహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు 386/4 పరుగుల వద్దే భారత్ తమ రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.

పేలవ ఫామ్తో విమర్శలు
ఈ మ్యాచ్ను భారత్ గెలుస్తుందని అంతా భావించినా.. ఆసీస్ ఎ ఆటగాళ్ల పోరాటంతో ఆ జట్టు ఊపిరి పీల్చుకుంది. అయితే ఇక్కడ భారత్కు మంచి ప్రాక్టీస్ లభించింది. టెస్టు సిరీస్కు జట్టును ఎలా ఎంపిక చేయాలనే దానిపై స్పష్టత వచ్చింది. ప్రధానంగా రిషబ్ పంత్ను ఎంపిక చేయాలా వద్దా అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. ఇందుకు కారణం పంత్ హిట్టింగ్తో సెంచరీ చేయడమే. గత కొంతకాలంగా పేలవ ఫామ్తో విమర్శలు ఎదుర్కొన్న పంత్.. ఆస్ట్రేలియా-ఎ జట్టుతో సిడ్నీ వేదికగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో కేవలం 73 బంతుల్లోనే 9 ఫోర్లు, 6 సిక్స్లతో అజేయంగా 103 పరుగులు చేశాడు.

73 బంతుల్లోనే సెంచరీ
మ్యాచ్లో రెండో రోజైన శనివారం చివరి ఓవర్కు ముందు 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న రిషబ్ పంత్.. చివరి ఓవర్లో 22 పరుగులు సాధించి సెంచరీ పూర్తి చేయడం విశేషం. విల్డర్మత్ వేసిన ఆఖరి ఓవర్ మొదటి బంతి అతని పొట్టలో బలంగా తగిలింది. అనంతరం తర్వాతి ఐదు బంతుల్లో 4, 4, 6, 4, 4 బాదిన పంత్ 73 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని అజేయంగా నిలిచాడు. ఈ సెంచరీపై బీసీసీఐ అధికారిక వెబ్సైట్తో పంత్ మాట్లాడాడు. బంతి తగలగానే చాలా కోపం వచ్చిందని, అందుకే సెంచరీ చేశానని పంత్ చెప్పుకొచ్చాడు.

క్రీజులోనే ఉండాలనుకున్నా
'నేను బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వచ్చినపుడు చాలా ఓవర్లు మిగిలి ఉన్నాయి. నేను, హనుమ విహారి మంచి భాగస్వామ్యాన్ని నిర్మించాలనుకున్నాం. వీలైనంత వరకు బ్యాటింగ్ చేయాలనుకున్నాం. ఎక్కువ సమయం క్రీజులో ఉండాలనుకున్నా. నెమ్మదిగా పరుగులు చేస్తూ విశ్వాసాన్ని పెంపొందించుకున్నా. మరోవైపు విహారి అండగా నిలిచాడు' అని రిషబ్ పంత్ తెలిపాడు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 194 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్లో 386/4 వద్ద డిక్లేర్డ్ చేసింది. ఆసీస్ ఎ తొలి ఇన్నింగ్స్లో108 ఆలౌట్.. రెండో ఇన్నింగ్స్లో 75 ఓవర్లలో 307/4 చేసింది.

చాలా కోపం వచ్చింది
'చివరి ఓవర్లో 20 పరుగులు చేస్తే సెంచరీ చేస్తాననుకున్నా. కానీ తొలి బంతే నా పొట్టలో బలంగా తగలింది. దాంతో నాకు చాలా కోపం వచ్చింది. ఇక హిట్టింగ్కు దిగాలని నిర్ణయించుకున్నా. అదే సమయంలో హనుమ విహారి కూడా నాకు సపోర్ట్గా నిలిచాడు. నువ్వు ట్రై చేస్తే సెంచరీ చేస్తావని చెప్పాడు. నేను తప్పకుండా ట్రై చేస్తానని చెప్పా. ఒకవేళ సెంచరీ చేస్తే అంతకంటే మంచిది ఉండదనుకున్నా. దాంతో హిట్టింగ్కు దిగి సెంచరీ చేశా' అని రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
'ఇద్దరూ మంచి ఫామ్లో ఉన్నారు.. ఆ స్థానంపై నిర్ణయం తలనొప్పే'